
31వరకు ‘పోలీస్ యాక్ట్’ అమలు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ‘30 పోలీస్ యాక్ట్’ అమల్లో ఉంటుందని ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాక్ట్లో అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయకూడదని సూచించారు. అనుమతులు లేకుండా ఆయా కార్యక్రమాలు నిర్వహించినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను, అసత్యాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి
చివ్వెంల (సూర్యాపేట) : తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. బుధవారం చివ్వెంల మండల పరిధిలోని సూర్యానాయక్తండా, వాల్యతండా, వట్టిఖమ్మంపహాడ్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని తరలించారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. తేమశాతం 17 ఉండాలని పేర్కొన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందు వల్ల ఎక్కువ మొత్తంలో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీ వెంకన్న, నిర్వాహకులు పాల్గొన్నారు.
హక్కుల సాధనకు పోరాడేది ఎర్రజెండానే
గరిడేపల్లి: కార్మికుల హక్కుల సాధనకు నిరంతరం పోరాడేది ఎర్రజెండా అని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం గరిడేపల్లి మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామంలో మేడే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులు, రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని కోరారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎస్.కె. యాకూబ్, సీపీఎం సీనియర్ నాయకులు తుమ్మల సైదయ్య, సుందరి వీరరాఘవయ్య, బొల్లెపల్లి శ్రీనివాసు, సుందరి రమాదేవి, జుట్టుకొండ కలమ్మ, వెంకటేశ్వర్లు, నారాయణ, మట్టయ్య, వెంకయ్య, సైదులు, ధనమూర్తి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసచారి, వెంకన్న, సైదులు, జంగయ్య, వీరస్వామి, భూతం నాగరాజు, శేఖర్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగించాలి
రామగిరి(నల్లగొండ): పాలిసెట్–2025 దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించాలని పాలిటెక్నిక్ ఎస్సీ, ఎస్టీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ కోరారు. పాలిసెట్ దరఖాస్తులకు లేట్ ఫీజుతో ఏప్రిల్ 21 చివరి తేదీగా నిర్ణయించి.. టెన్త్ ఫలితాలు ఏప్రిల్ 30న ప్రకటించడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. మే 13న ఎంట్రెన్స్ ఉన్నందున దరఖాస్తు తేదీని పొడిగించి మరింత మంది విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అధికారులను కోరారు.