
భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం
మేళ్లచెరువు : భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం మేళ్లచెరువు మండలకేంద్రంలో నిర్వహించిన భూ భారతిచట్టం –2025 అవగాహన సదస్సును అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ధరణితో రైతుల సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు ఎదుర్కొన్నారని దీంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసి 18 రాష్ట్రాల్లో నిపుణులు, మేధావులు, అధికారుల సూచనలు తీసుకొని భూభారతిచట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి మనిషికి ఆధార్నంబర్ ఉన్నట్లుగానే ప్రతి కమతానికి భూధార్ నంబర్ కేటాయిస్తామన్నారు. రైతుల భూమికి హద్దులతో కూడిన మ్యాప్ రూపొందించి ఇస్తామన్నారు. ఫౌతి చేసేటప్పుడు కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చి తదనంతరం రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు. గతంలో చేసిన మ్యుటేషన్లపై అప్పీల్ చేసుకునేందుకు ధరణిలో అవకాశం లేదని కానీ భూభారతిలో ఎటువంటి అభ్యంతరం ఉన్నా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ల వద్ద పరిష్కారం చేసుకోవచ్చని లేని పక్షంలో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు , మహిళా రైతులకు ఉచితంగా న్యాయ సలహాలు అందించనున్నట్లు తెలిపారు. త్వరలో గ్రామ పాలన అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు,వ మండల ప్రత్యేక అధికారి పద్మ, తహసీల్దార్ జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికదేశ్ముఖ్, ఎస్ఐ పరమేష్, కాకునూరి భాస్కరరెడ్డి, కొట్టె సైదేశ్వరరావు, రామచంద్రయ్య, గంగయ్య, సుధాకర్నాయక్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్