
నేడు గోదావరి జలాల విడుదల
ఫ నాలుగు రోజుల పాటు సరఫరా
అర్వపల్లి: జిల్లావ్యాప్తంగా ఎస్సారెస్పీ రెండోదశ కింద 2.50 లక్షల ఎకరాల వరి సాగవుతోంది. యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాకు గోదావరి జలాల విడుదల షెడ్యూల్ ప్రకారం పూర్తయింది. కానీ వరి పంట చేతికందే దశలో నీటి సరఫరా నిలిచిపోవడంతో చేలు ఎండిపోతున్నాయి. కనీసం మరో విడత అయినా నీటిని వదిలి ఎండిపోతున్న పొలాలను కొంతవరకై నా కాపాడాలని అన్నదాతలు ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ఎల్ఎండీ అధికారులపై తీవ్ర వత్తిడి తెచ్చి ఒప్పించి ఎట్టకేలకు కనీసం నాలుగు రోజులు నీటిని ఇవ్వాలని కోరగా అంగీకరించారు. ఎల్ఎండీ నుంచి రెండో దశకు నీటిని మంగళవారం వదిలారు. అయితే ఈ నీళ్లు బయ్యన్నవాగుకు చేరాక బుధవారం మధ్యాహ్నం బయ్యన్నవాగు నుంచి సూర్యాపేట జిల్లాకు విడుదల చేయనున్నట్లు డీఈఈ ఎం.సత్యనారాయణ తెలిపారు.
శ్రీలక్ష్మీనృసింహుని
నిత్య కల్యాణం
మఠంపల్లి: ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహుని నిత్య కల్యాణం మంగళవారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి విశేష పూజలు, అర్చనలు గావించారు. అదేవిధంగా నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
విద్య, వైద్యం
ఉచితంగా అందించాలి
చిలుకూరు : పేద ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో సీపీఐ మహాసభలను ప్రారంభించి మాట్లాడారు. పాలకులకు కార్పొరేట్ శక్తులపై ఉన్న ప్రేమ సామాన్య ప్రజలపై లేదని ఆరోపించారు. అనంతరం ఆ గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా మూడోసారి కందుకూరి శ్రీను, సహాయ కార్యదర్శిగా కాటూరు బజారు, ఎరగాని వెంకన్న ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అద్యక్షుడు దొడ్డా వెంకటయ్య, కీసర కొండలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల నిర్బంధాన్ని
ఖండిస్తున్నాం
సూర్యాపేట అర్బన్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, సీపీఎం నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 2న సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఫణిగిరి బౌద్ధ క్షేత్రం
వద్ద భీమ్ దీక్ష
నాగారం : మహనీయుల ఆశయాలు సాధించేందుకు ప్రతిఒక్కరూ భీమ్ దీక్షలో భాగస్వాములు కావాలని బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ ఎర్ర రాంబాబు కోరారు. బుధవారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రం వద్ద స్వేరో కార్యకర్తలు మిరియాల మధు, మాచర్ల సైదులు భీమ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో రాంబాబు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏడాది మార్చి 15న సాహెబ్ కాన్షీరామ్ జయంతి నుంచి భీమ్ దీక్ష ప్రారంభమై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున దీక్ష ముగుస్తుందని తెలిపారు. మహనీయులను స్మరించుకుంటూ వారి ఆశయాలను సాధించడం కోసం భీమ్ దీక్ష చేపడుతున్నామన్నారు. ఈ దీక్షలో స్వేరో సభ్యులు చుక్క సురేష్, వడ్డేపల్లి భాష, ఎర్ర రమేష్, మామిడి రాంబాబు, ఎర్ర పరశురాం, ఎర్ర రఘు తదితరులు పాల్గొన్నారు.