ప్పు పట్టిన పరికరాలు..
ప్పలతో పరిసరాలు
ఫారం ఇవ్వలేదు
రెండు ఫారాలు ఇవ్వాలన్నారు..
ఏమీ తెలీడం లేదు
● ఓటరు దగ్గర ఒక్క ఫారమైనా ఉంచరా? ● కొత్తూరులో రెండు ఫారాలు తిరిగి తీసుకుంటున్న బీఎల్ఓలు ● బీఎల్ఓల తీరుపై అనుమానాలు ● తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 2026 ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ఆరోపణలు ఉన్నాయి. ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఎక్కడికక్కడ భయం పట్టుకుంది. తమ ఓట్లు ఏమవుతాయోనన్న ఆందోళన నెలకొంది. పారదర్శకంగా వ్యవహరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్ఓలపై ఉంది. అప్పుడే ప్రత్యేక సమగ్ర సవరణకు విలువ ఉంటుంది. కానీ కొత్తూరు మండలంలో కొందరు బీఎల్ఓలు ఓటర్కు ఇచ్చిన రెండు ఫారాలు నింపి, సంతకం చేసి, రెండింటినీ తిరిగి ఇవ్వాలని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. వాస్తవంగా బీఎల్ఓ సంతకంతో కూడిన ఒక ఫారం ఓటర్ వద్ద ఉండాలి. మరొకటి బీఎల్ఓలు తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా కొందరు బీఎల్ఓలు వ్యవహరిస్తుండటంపై అనుమానాలకు తావిస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణ కచ్చితంగా జరుగుతుందా? ఏదైనా తేడా జరుగుతుందా? అన్న ఆందోళనకు అవకాశమిస్తోంది. ఒక్క కొత్తూరులోనే కాదు జిల్లాలో అనేక చోట్ల ఇదేరకంగా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
తహసీల్దార్కు ఫిర్యాదు
ఓటరుకు ఇచ్చిన రెండు ఫారాలలో ఒకటి ఓటర్కు ఇవ్వాలని, మరొకటి బీఎల్ఓ తీసుకోవాలని కొత్తూరు తహసీల్దార్ సరోజనీకి వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గండివలస ఆనందరావు, మండల బూత్ కమిటీ అధ్యక్షుడు గోడబండి పోలయ్య, ఎంపీటీసీ వనుము లక్ష్మీ నారాయణ కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రెండు ఫారాలు తీసుకోవడం సరికాదని, కొందరు బీఎల్ఓల తీరుపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై తహసీల్దార్ సరోజినిని ‘సాక్షి’ వివరణ కోరగా ఒక ఫారం ఓటర్ దగ్గరే ఉంటుందని, బీఎల్ఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని చెప్పారు.
బీఎల్ఓ ఇంటికొచ్చి రెండు ఫారాలు ఇచ్చారు. వాటిపై సంతకాలు చేయించారు. వివరాలు నింపి, సంతకాలు చేశాక ఆ రెండు ఫారాలను బీఎల్ఓ తన వెంట తీసుకెళ్లిపోయారు. మాకు ఒక్క ఫారం కూడా ఇవ్వలేదు.
– కొత్తూరు మండలం ఒండ్రు జోలకు చెందిన
కింతల మన్మధరావు, కింతల శ్రీనివాసరావు
ఓట్ల తనిఖీలో భాగంగా బీఎల్ఓ మా ఇంటికి వచ్చారు. వివరాలు అడిగారు. రెండు ఫారాలు ఇచ్చారు. రెండు ఫారాలపైన ఫొటో అంటించి, సంతకం పెట్టి తిరిగి ఇవ్వాలని బీఎల్ఓ చెప్పారు. మళ్లీ వస్తాను అప్పటికి సిద్ధంగా ఉంచండి అని అన్నారు.
– పాటంశెట్టి శ్రీరాములు, కొత్తూరు గ్రామం
ఇంటికొచ్చి బీఎల్ఓ రెండు ఫారాలు ఇచ్చారు. వాటిని నింపి సంతకం చేసి ఇవ్వండని చెబుతున్నారు. ఏంటో తెలియడం లేదు.
– పాటంశెట్టి అమ్మాయమ్మ, కొత్తూరు


