● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్లో 99 వినతులు స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీలను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో భాగంగా బాధితుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించరాదని, ప్రతీ అర్జీదారుడికి సంత ప్తికరమైన సమాధానం అందాలని ఆయన స్పష్టం చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 99 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 22 అర్జీలు రాగా, పంచా యతీ రాజ్ శాఖకు 20, సెర్ప్ విభాగంలో 15, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 9 వినతులు అందాయి. పోలీసు శాఖకు 4, సర్వే సెటిల్మెంట్స్ మరియు విద్యుత్ శాఖలకు సంబంధించి చెరో 3 చొప్పున ఫిర్యాదులు వచ్చాయి.
రెవెన్యూ క్లినిక్ పర్యవేక్షణ
పీజీఆర్ఎస్ అనంతరం కలెక్టర్ అక్కడ ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ను స్వయంగా పర్యవేక్షించారు. మండలాల వారీగా ఏర్పా టు చేసిన డెస్క్ల వద్దకు వెళ్లి, దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి వారి భూసంబంధిత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే రెవెన్యూ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించాలని, ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
కొన్ని వినతులు పరిశీలిస్తే...
●వారసత్వంగా వచ్చిన తన జిరాయతీ భూమి 20 సెంట్లలో వజ్రపుకొత్తూరు మండల అధికారులు నలుగురికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని, వారికి వేరేచోట ఇళ్ల పట్టాలి ఇప్పించి తన స్థలం తనకు ఇవ్వాలని వజ్రపుకొత్తూరు మండలం కంబాల రా యుడుపేట గ్రామానికి చెందిన బైపల్లి పార్వతి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఇదివరకే ఫిర్యాదు చేశానని, తనకు అనుకూలంగా న్యాయస్థానం కూడా తీర్పునిచ్చినప్పటికీ రెవె న్యూ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
●అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని, ఖాతాదారులకు న్యా యం చేయాలని కోరుతూ పాతపట్నం అగ్రిగోల్డ్ బ్రాంచ్ పరిధి లో ఉన్న ఏజెంట్లు, ఇతర సిబ్బంది పీజీఆర్ఎస్లో కోరారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.
●గార మండలం అంపోలు గ్రామానికి చెందిన కురమాన మల్లేశ్వరరావుకు ప్రభుత్వం గతంలో డీ –పట్టా ఇచ్చిందని, అయితే రీ–సర్వేలో 1బీ అడంగల్ లేకుండా చేశారని, తిరిగి తనకు అడంగల్ పాస్బుక్ మంజూరు చేయాలని ఆయన కోరారు.
●సంకిలి షుగర్ ఫ్యాక్టరీలో 1996 నుంచి పనిచేస్తున్న 16 మంది ఉద్యోగులను ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా మేనేజ్మెంట్ ఉద్యోగాల నుంచి తొలగించిందని, తమను వెంటనే తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వారు కోరారు.


