
పరిహారం కోసం.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
మెళియాపుట్టి : జిల్లా అభివృద్ధిలో భాగంగా భూములు, ఇళ్లు, గ్రామాలను సైతం త్యాగం చేసిన నిర్వాసితులు నేడు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. కుటుంబాలతో కలిసి నెల రోజులకు పైగా నిరాహార దీక్షలు చేస్తున్నా కూటమి పాలకులు గానీ, అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో నిర్వాసితుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంటోంది. పలాస మండలం రేగులపాడు వద్ద దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ఆఫ్షోర్ ప్రాజెక్టు కోసం సరిహద్దులో ఉన్న మెళియాపుట్టి మండలంలోని చీపురుపల్లి, దాసుపురం, సవర చీపురుపల్లి గ్రామాల నిర్వాసితులు సర్వం త్యాగం చేశారు. వీరితో పాటు టెక్కలి, నందిగాం మండలాలకు చెందిన పలు గ్రామాల నిర్వాసితులకు న్యాయపరంగా ప్యాకేజీలు అందించాల్సి ఉన్నా పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పాలకులు మారుతున్నా తమకు న్యాయం జరగకపోవడంతో ఈ ఏడాది మే 22న మెళియాపుట్టి మండలం చీపురుపల్లిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. నేటికి 33 రోజులైనా స్పందించే వారే కరువయ్యారని నిర్వాసితులు వాపోతున్నారు.
ఎన్నాళ్లో ఈ ఎదురుచూపులు..
ఈ ప్రాంతంలో అర్హులైన 132 మందికి నేటికీ పరిహారాలు అందలేదు. గ్రామంలో 14.55 ఎకరాల డి–పట్టా భూములకు సైతం పరిహారం చెల్లించలేదు. అంతేకాకుండా సుమారు 240 మంది యువతకు యూత్ ప్యాకేజీలు అందాల్సి ఉంది. 360 కుటుంబాలకు 5 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హిరమండలం నిర్వాసితులకు జీవో 460 ప్రకారం పూర్తిస్థాయి ప్యాకేజీలు ఇవ్వాల్సి ఉన్నా చెల్లింపుల్లో తేడాలు జరిగాయని, వాటిని సవరించి ఇళ్లకు సంబంధించి పరిహారం ఇవ్వాలని గ్రామానికి చెందిన యవ్వారి ఈశ్వరరావు, నందిగాం జగన్నాయకులు, గుమ్మడి మల్లేసు, నందిగాం హేమలత, చిన్నమ్మి, కొక్కిరి కిరణ్, ఉమాశంకర్, వెంకటరమణ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.
పాలకుల స్పందన కరువు..
పరిహారం విషయమై నిర్వాసిత గ్రామాల్లో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సైతం నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారి సమస్యలు పరిష్కారం కాలేదని నిర్వాసిత కుటుంబీకులు చెబుతున్నారు. ఇప్పటికై నా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఆఫ్షోర్ నిర్వాసితులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
33 రోజులుగా దీక్షలు చేస్తున్న
మెళియాపుట్టి మండల నిర్వాసితులు
పరిహారానికి నోచుకోని 132 కుటుంబాలు
240 మందికి అందని యూత్ ప్యాకేజీలు
వలస కూలీనంటూ..
ఇద్దరు పిల్లలతో కలిసి కాలం వెల్లదీస్తున్నాను. వలస కూలీ గా ఉన్నానంటూ అధికారుల తప్పుగా నమోదు చేయడంతో ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. పరిహారం కోసం అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి పరిహారం ఇప్పించాలి.
– ఇప్పిలి వరలక్ష్మి,
చీపురుపల్లి, మెళియాపుట్టి మండలం
ఎలా బతకాలి?
ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసి గ్రామాలను విడిచి బయట బతుకుతున్నాం. నా కుటుంబానికి ఒక్కపైసా ప్యాకేజీ రాలేదు. నాకు ముగ్గురు పిల్లలు. నిర్వాసితుడినైనా పరిహారానికి నోచుకోలేదు. ఇలాగైతే ఎలా బతకాలి? న్యాయం కోసం దీక్షలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
– నందిగాం భాస్కరరావు,
చీపురుపల్లి, మెళియాపుట్టి మండలం

పరిహారం కోసం.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు?

పరిహారం కోసం.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు?

పరిహారం కోసం.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు?