
రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్: స్థానిక ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఎం.వెంకటరమణ అనే తాపీమేస్త్రి మంగళవారం ఉదయం రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. పర్లాఖిమిడి నుంచి టెక్కలి వచ్చేందుకు గుణ్పూర్–పూరీ పాసింజర్ రైలులో వస్తుండగా లింగాలవలస సమీపంలోని లక్ష్మీపురం వద్ద ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు వివరాలు సేకరించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్ ఆవరణలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు నలుపు టీషర్టు, నీలం జీన్స్ ఫ్యాంట్ ధరించాడని, సుమారు 50 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉండవచ్చని పలాస జీఆర్పీ హెచ్సీ ఎం.సోమేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఎంఎస్ఎంఈలకు
వర్క్షాపు రేపు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పరిచయం చేసేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జూన్ 26న ఉదయం 10.30 గంటలకు నరసన్నపేటలోని శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఫంక్షన్ హాలులో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. డీఐసీ, ఏపీఎస్ఎఫ్సీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ వర్క్షాప్లో పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వివిధ పాలసీలు, ప్రభుత్వ పథకాలపై సంపూర్ణ వివరాలు అందించనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు ఈ వర్క్షాప్ ఉపయుక్తంగా ఉంటుందని, కార్యక్రమంలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో హాజరైన వారు ఉచితంగా రిజిస్ట్రేషన్ పొందవచ్చని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని శ్రీధర్ కోరారు.
పోయిన డబ్బులు తిరిగొచ్చాయి!
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం నగరానికి చెందిన సూరపు కృష్ణవేణి అనే సీనియర్ సిటిజన్ తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.3లక్షలు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో జమ చేసేందుకు బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించారు. సాంకేతిక కారణాలతో ఆ నగదు చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తి అకౌంట్లో జమయ్యింది. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం హెడ్ పోస్టాఫీస్ అధికారులు, డివిజనల్ ఆఫీస్ అధికారులు సకాలంలో స్పందించి సీఈపీటీ ద్వారా ఆ నగదును కృష్ణవేణి అకౌంట్లోకి తిరిగి జమ చేయించారు. పోయిన డబ్బులు తిరిగి వచ్చినందుకు ఖాతాదారు మంగళవారం పోస్టల్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో హెడ్ పోస్టాఫీస్ పోస్ట్మాస్టర్ పడాల రంగారావు, అసిస్టెంట్ పోస్ట్మాస్టర్ నూలు భానోజీరావు పాల్గొన్నారు.

రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు

రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు