
కలెక్టర్, ఎస్పీలకు ప్రశంసలు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : సముద్ర తీరప్రాంత గ్రామమైన పెద్దగనగళ్లవానిపేటలో ఈ నెల 3న నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆరు వేల మందికిపైగా మత్స్యకారులు పాల్గొని యోగాసనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిలను అభినందించారు.
తెల్లదోమ నివారణకు చర్యలు తీసుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్దానంలో కొబ్బరి పంటలో వ్యాప్తి చెందిన తెల్ల దోమ నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్కుమార్ మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలిసి వినతిపత్రం అందించారు. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాల్లో తెల్లదోమ వల్ల కొబ్బరిపంట దిగుబడి తగ్గి రైతులు పూర్తిగా నష్టపోతున్నారని చెప్పారు. వీటిపై పరిశోధన చేయించి ఉద్దాన ప్రాంత రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెల్లదోమపై ప్రభుత్వం డ్రోన్ ద్వారా మందులు చల్లాలని విన్నవించారు.
బంగారమ్మ తల్లి హుండీలో చోరీ
ఎల్.ఎన్.పేట : లక్ష్మీనర్సుపేట వద్ద వంశధార నదీ తీరంలో ఉన్న బంగారమ్మ తల్లి ఆలయంలో హుండీ చోరీకి గురైంది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీని ధ్వంసం చేసి నగదు, కానుకలు దొంగిలించుకుపోయారని సర్పంచ్ ముగడ దివాకరనాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం భక్తులు ఆలయానికి వెళ్లేసరికి చోరీ జరిగినట్లు గుర్తించడంతో సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

కలెక్టర్, ఎస్పీలకు ప్రశంసలు