ఆ తీగే ప్రాణాలు తీసింది.. | - | Sakshi
Sakshi News home page

ఆ తీగే ప్రాణాలు తీసింది..

May 27 2025 12:38 AM | Updated on May 27 2025 12:38 AM

ఆ తీగ

ఆ తీగే ప్రాణాలు తీసింది..

ఆదివారం రాత్రి ఆ ఊరికి అమ్మవారిని తీసుకువచ్చారు. మంగళవారం గ్రామదేవత ఉత్సవం ముగించనున్నారు. జనమంతా ఆ వేడుకల్లోనే తలమునకలై ఉన్నారు. చివరి అంకానికి వచ్చిన సంబరాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ పండుగల వేళ ఊరంతా ఉలిక్కిపడేలా ఓ విద్యుత్‌ తీగ యమపాశం విసిరింది. మేనమామను మేనల్లుడిని కలిపి తీసుకెళ్లిపోయి ఆ కుటుంబానికి ఆధారం లేకుండా చేసింది. ఉత్సవం చూసేందుకు వచ్చిన అమ్మాయి ఆయువును ఆపేసి ఆ ఇంట చీకటి నింపింది. ఈ దుర్ఘటనతో సామంతపుట్టుగ పుట్టెడు దుఖంలో మునిగిపోయింది.

మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

గోప్యంగా ఉంచేందుకు..

సోమవారం ఉదయం 8గంటలకు ఈ సంఘటన జరిగినప్పటికీ బయటకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచేందుకు గ్రామ స్తులు ప్రయత్నించారు. విద్యుత్‌ శాఖ అధికారులను రానీయకుండా, మీడియా వాళ్లను కూడా ఏమార్చి ఏమీ జరగనట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసులు, మీడియా వారు గ్రామానికి చేరుకోవడంతో విషయం బయట ప్రపంచానికి తెలిసింది. సోంపేట సీఐ బి.మంగరాజు, కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటలకు సోంపేట విద్యుత్‌శాఖ ఏడీ ఎం.రవికుమార్‌, కంచిలి ఏఈ ఎన్‌.గురవయ్య, మిగతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొన్నారు. తర్వాత ఎస్‌ఈ ఎన్‌.కృష్ణమూర్తి చేరుకొని సమీక్షించారు. అదేవిధంగా పలాస ఆర్డీఓ వెంకటేశ్వరరావు, స్థానిక తహసీల్దార్‌ ఎన్‌. రమేష్‌కుమార్‌, ఆర్‌ఐ కృష్ణచంద్ర రౌళో, వీఆర్‌ఓ దుద్ది మురళి కూడా వచ్చి పరిశీలించారు. కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు వచ్చి ఆరా తీశారు.

విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి

సామంతపుట్టుగలో ఘటన

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

గ్రామ ఉత్సవాలకు వాడిన విద్యుత్‌ అలంకరణ తీగే ప్రమాదానికి కారణం

కంచిలి:

సామంతపుట్టుగ(చిల్లపుట్టుగ)లో సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో విద్యుత్‌ షాక్‌కు గురై ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. గ్రామదేవత ఉత్సవాల చివరి అంకంలో జరిగిన ఈ విషాద సంఘటనతో గ్రామమంతా శోకమయమైంది. వివరాల్లోకి వెళితే..

సామంతపుట్టుగ గ్రామంలో గ్రామదేవత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు జరిగింది. గ్రామంలోకి అమ్మవారు వచ్చి వెళ్లిన తర్వాత ఏర్పాటు చేసిన విద్యుత్‌ అలంకరణను సోమవారం ఉదయం తొలగించారు. కానీ ఒక జీఏ వైరును మాత్రం విడిచిపెట్టేయగా.. అది తెగి కింద పడింది. ఆ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారులు ఆ తీగను తాకడంతో విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో మొదట బాడపల్లి నందిని (12) అనే బాలిక తెగిపడిన జీఏ వైరు చుట్టు కుని షాక్‌కు గురి కాగా.. ఆ బాలికను కాపాడబోయి చిల్ల ఈశ్వర్‌(28) విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ వెనుకనే ఉన్న నాలుగేళ్ల బాలుడు నొళియా కృష్ణకు కూడా షాక్‌ తగిలింది. వీరు ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు కూడా విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్రగాయాలపాలయ్యారు. మరికొందరు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.

ఆ కుటుంబానికి దిక్కేదీ.?

ఘటనలో మృతి చెందిన చిల్ల ఈశ్వర్‌ కుటుంబానికి తనే ఆధారం. ఈశ్వర్‌ డిగ్రీ వరకు చదువుకొని, గ్రూప్స్‌ ప్రిపరేషన్‌ కోసం శ్రీకాకుళం వెళ్లి అక్కడ ఒక హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. ఈశ్వర్‌కు కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామానికి చెందిన యువతితో రెండేళ్ల కిందటే వివాహం నిశ్చయమైంది. ఏడాది కిందట ఈశ్వర్‌ చెల్లెలి భర్త మృతి చెందడంతో వివాహం వాయిదా పడింది. ఈశ్వర్‌ తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. చెల్లెలికి కూడా భర్త లేకపోవడంతో రెండు కుటుంబాలను ఈశ్వర్‌ ఒక్కడే చూ స్తున్నాడు. 42 ఏళ్ల తర్వాత గ్రామదేవత ఉత్సవాలు జరుగుతుండడంతో ఆదివారం మధ్యాహ్నమే అతను స్వగ్రామానికి వచ్చాడు. ఉత్సాహంగా ఉత్సవంలో పాల్గొన్నాడు. కానీ విధి వక్రీకరించి సోమ వారం ఉదయం ప్రమాదానికి గురై విగతజీవిగా మారాడు. మరో నెల రోజుల్లో ఈశ్వర్‌కు పెళ్లి ము హూర్తం ఖరారు చేయాలని అనుకుంటుండడంగా ఈ ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. మృతుల్లో ఒకడైన నాలుగేళ్ల బాలు డు నొళియా కృష్ణ ఈశ్వర్‌ చెల్లెలి లక్ష్మి కుమారుడు. వీరిది బంజిరి నారాయణపురం గ్రామం. ఉత్సవా లు చూసేందుకు రాగా.. ఈ ప్రమాదం జరిగింది.

దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాడపల్లి నందిని స్వగ్రామం పురుషోత్తపురం గ్రామం. ఈ బాలిక కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి పూర్తిచేసుకుంది. ఉత్సవాలు చూసేందుకు శుక్రవారం తన పిన్ని ఇంటికి వచ్చింది. ఇంతలో చావు ఎదురైంది. మృతురాలి తల్లిదండ్రులు రాజేశ్వరి దీనబంధు బాలిక మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించారు.

గ్రామదేవత ఉత్సవాల సందర్భంగా తమంతట తామే విద్యుత్‌ అలంకరణ చేసుకోడానికి స్థానిక కమిటీ యువత బరంపురం వెళ్లి విద్యుత్‌ అలంకరణ చేసే సీరియల్‌ సెట్లు గుత్తులు తీసుకొచ్చారు. వారే సొంతంగా అమర్చుకున్నారు. సంబరాలు మంగళవారంతో ముగియనుండటంతో విద్యుత్‌ అలంకరణను సోమవారం ఉదయం తొలగించేశారు. కానీ ఈ లైటింగ్‌ కోసం కరెంటు సరఫరా చేసిన లైన్‌ను మాత్రం తొలగించలేదు. అదే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. విద్యుత్‌ ఉపకరణాలకు ఏర్పాటు చేసిన జీఏ వైరు తీగ కింద పడిపోవడం, అక్కడే వీధిలో ఆటలాడుకుంటున్న చిన్నారులు గమనించకపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. సంఘటనలో తీవ్రంగా గాయాలపాలైన పొడియా మనోజ్‌ను సోంపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా, మెరుగైన చికిత్స కోసం బరంపురం మెడికల్‌కు తరలించారు. గాయపడిన చిల్ల తరుణ్‌ అనే మరో వ్యక్తి నాలుగు రోజుల కిందటే బయటి దేశం నుంచి గ్రామానికి వచ్చాడు. ఇతను సోంపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆ తీగే ప్రాణాలు తీసింది.. 1
1/5

ఆ తీగే ప్రాణాలు తీసింది..

ఆ తీగే ప్రాణాలు తీసింది.. 2
2/5

ఆ తీగే ప్రాణాలు తీసింది..

ఆ తీగే ప్రాణాలు తీసింది.. 3
3/5

ఆ తీగే ప్రాణాలు తీసింది..

ఆ తీగే ప్రాణాలు తీసింది.. 4
4/5

ఆ తీగే ప్రాణాలు తీసింది..

ఆ తీగే ప్రాణాలు తీసింది.. 5
5/5

ఆ తీగే ప్రాణాలు తీసింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement