
ఎందుకంత ఆదరాబాదరా..?
శ్రీకాకుళం న్యూకాలనీ:
ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను ఆదరాబాదరాగా చేపడుతుండటంతో టీచర్లకు పా ట్లు తప్పడంలేదు. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ ఆఖరిదశకు చేరుకుంది. సెకండరీ గ్రేడ్ టీచర్లకు కౌన్సెలింగ్ తీరుపై స్పష్టత రాకపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సీలింగ్లో నాడు మేలు–నేడు కీడు..
చాలా మంది టీచర్లు ప్రస్తుతమున్న పాఠశాలలో అనేక ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ గరిష్టంగా 8 ఏళ్లకు మాత్రమే ప్రభుత్వం పాయింట్లు కేటాయిస్తుంది. మిగిలిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ అనేక ఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లకు కూటమి సర్కారు తీరని అన్యాయం చేస్తోంది. వీరంతా సుమారు ఆరేడు పాయింట్లు కోల్పోతున్నారు. 2023లో ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంతో సీలింగ్ విధానాన్ని ప్రభు త్వం ఎత్తి వేసింది. దీంతో నాడు ఎంతోమంది టీచర్లకు మేలు జరిగింది. నేడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. బదిలీ దరఖాస్తు గడువు పొడిగించాలని టీచర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వర్ సరిగా పనిచేయడం లేదని, అనేక సాంకేతిక సమస్యలతో ఆన్లైన్లో డాక్యుమెంట్లు అప్లోడింగ్ తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 2014 డీఎస్సీ అభ్యర్థులకు పాయింట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎస్జీటీల కౌన్సెలింగ్ తీరుపై
సందేహాలు..
ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మొదలైనప్పటికీ సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీ) కౌన్సెలింగ్ ఎలా నిర్వహించాలన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించినప్పటికీ బదిలీల కౌన్సెలింగ్ మాత్రం ఆఫ్లైన్ ద్వారానే చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎస్జీటీలు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఎస్జీటీలు జూన్ 7 నుంచి 10వ తేదీ లోపు ఆప్షన్ ఇచ్చుకుంటే జూన్ 11వ తేదీన బది లీ ఉత్తర్వులు ఆన్లైన్ ద్వారానే వెలువడతా యని మార్గదర్శకాల్లో ఉండటం గమనార్హం.
ఎంటీఎస్ టీచర్లకు తీవ్ర అన్యాయం..
తాజా సాధారణ ఉపాధ్యాయ బదిలీల్లో 1998 డీఎస్సీతో పాటు 2008 డీఎస్సీ మినిమం టైమ్ స్కేల్ టీచర్లు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. వారు పనిచేస్తున్న పోస్టులను ఖాళీల జాబితాలోకి తీసుకురావడంతో వారి పోస్టులు గల్లంతయ్యాయి. అలాగే దంపతులిద్దరూ ఉద్యోగులైతే బదిలీల్లో ఎవరో ఒకరికి స్పౌజ్ పాయింట్లు ఇస్తారు.
అయితే 1998 డీఎస్సీతో పాటు 2008 డీఎస్సీలో అన్యాయానికి గురైన టీచర్లకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) పద్ధతిన వారికి ఉద్యోగాలు కల్పించారు. వీరిలో 70 నుంచి 80 శాతం మంది పదవీ విరమణ దశకు చేరుకున్నారు. అయితే వీరి భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయితే వారికి కచ్చితంగా బదిలీల్లో స్పౌజ్ పాయింట్లు కేటాయించాలి. కానీ కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లను ఇప్పటికీ తమ వ్యతిరేకులుగానే చూస్తోంది. కేజీబీవీల్లోని టీచర్లకు స్పౌజ్ పాయింట్లు కేటాయిస్తున్నప్పటికీ, ఎంటీఎస్ టీచర్లకు మాత్రం మొండిచేయి చూపుతుండటాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు.
సీనియారిటీ పాయింట్లను
సరి చేయాలి
బదిలీల్లో అన్ని కేటగిరీ టీచర్లకు మాన్యువల్గానే కౌన్సెలింగ్ చేపట్టాలి. 8 ఏళ్లు పూర్తి చేసుకున్నవారికి సీనియారిటీ పాయింట్లను కేటాయించాలి. 117 జీఓ ద్వారా పదోన్నతిపై వెళ్లిన టీచర్లకు న్యాయం చేయాలి.
– బమ్మిడి శ్రీరామ్మూర్తి, యూటీఎఫ్
శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎలాంటి అపోహలు అవసరం లేదు
జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు అత్యంత పారదర్శకంగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఖాళీల జాబితాలను సిద్ధం చేశాం. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేస్తున్నాం. ఎవరికీ ఎలాంటి అనుమానాలు, అపోహాలు అవసరం లేదు. నిర్దేశించిన గడువులోపు టీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య,
డీఈఓ శ్రీకాకుళం
ఆదరాబాదరాగా
బదిలీలు సరికాదు..
అంతా గందరగోళంగా ఉంది. ఆగమేఘాల మీద చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఎన్నో సందేహాలు, సమస్యలు ఉన్నాయి. బదిలీలకు సంబంధించి సాఫ్ట్వేర్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. రీ–అపోర్షన్ ప్రక్రియలో ఎవరు మిగులు టీచర్లుగా ఉన్నారో తెలియడంలేదు. ఆదరాబాదరాగా బదిలీలు చేపడుతుండటం సరికాదు.– మజ్జి మదన్మోహన్, ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు
●
దరఖాస్తు మొదలు..
అన్నింటా టీచర్లకు తప్పని పాట్లు
ఎంటీఎస్ టీచర్లకు తీవ్ర అన్యాయం

ఎందుకంత ఆదరాబాదరా..?

ఎందుకంత ఆదరాబాదరా..?

ఎందుకంత ఆదరాబాదరా..?

ఎందుకంత ఆదరాబాదరా..?

ఎందుకంత ఆదరాబాదరా..?

ఎందుకంత ఆదరాబాదరా..?