
బొడ్డపాడులో అమరవీరుల స్మారక సభ రేపు
పలాస: పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద మంగళవారం ఉద యం 10గంటలకు జిల్లా అమరవీరుల స్మారక సభ నిర్వహిస్తున్నట్టు అమరవీరుల స్మారక సభ నిర్వాహక కమిటీ కన్వీనరు జోగి కోదండరావు ఓ ప్రకటనలో తెలిపారు. 1969 మే 27న అప్పటి జిల్లా నాయకులు పంచాది కృష్ణమూర్తితో పాటు ఆరుగురు విద్యార్థి యువజన నాయకులు పోలీసు బూటకపు ఎన్కౌంటర్లో కంచిలి మండలం జలంత్రకోటలో మృతి చెందారన్నారు. 55 ఏళ్ల తర్వాత ఇదే జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుకూడా ఇదే నెల లో పోలీసుల బూటకపు ఎన్కౌంటర్లో మృతి చెందారని తెలిపారు. అమరవీరులకు నివాళులర్పించడం ఈ ప్రాంత ప్రజల కనీస ధర్మమని, అందుకే ఈ స్మారక సభ నిర్వహిస్తున్నామని, సభను విజయ వంతం చేయాలని కోదండరావు కోరారు.
మృతదేహాలు అప్పగించకపోవడం అన్యాయం
కాశీబుగ్గ: చత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా ఏపీకి చెందిన మరో ఇద్దరి మృతదేహాల్ని వారి బంధువులకు ఆదివారం సైతం అప్పగించకపోవడం అన్యాయమని సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ అధికార ప్రతినిధి పి.ప్రసాద్, జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఆదివారం ఓ ప్రకటన విడుద ల చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు కాపీ తో మృతదేహాల కోసం శనివారం కేశవరావు సోదరుడు నారాయణపూర్ వెళ్లారని, ఆదివా రం రాత్రి 6 గంటల వరకు నిరీక్షించినా ఫలితం లేదన్నారు. ఏపీ పోలీసు అధికారుల ఒత్తిళ్ల కా రణంగానే మృతదేహాలు ఇవ్వడం లేదనే విషయం అర్థమవుతోందన్నారు. ఈ వైఖరిని ఖండిస్తున్నామని వారు తెలిపారు. వెంటనే ఏపీ హైకోర్టు స్పందించి మృతదేహల్ని వారి బంధువులకు అప్పగించడానికి చొరవ తీసుకోవాలని కోరారు.
బదిలీపై టీచర్ల నిరసన
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ బదిలీల్లో సీలింగ్ కోత వల్ల తమకు తీవ్రమైన నష్టం జరుగుతోందని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ పనిచేసిన గరిష్ట కాలానికి మొత్తం స్టేషన్ పాయింట్లను ఎలాంటి సీలింగ్ లేకుండా ఇప్పించాలని కోరారు. ఇదే విషయమై డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే అంతా జరుగుతుందని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మేలు జరిగేలా చూస్తామని డీఈఓ హామీ ఇచ్చినట్టు టీచర్లు తెలిపారు.
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీ దారుల అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి సమాచారం తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తీగ లాగారు.. డొంక కదిలింది
శ్రీకాకుళం క్రైమ్ : బెట్టింగ్ మాఫియా తీగ పోలీసుల చేతికి చిక్కడమే కాదు.. డొంక కూడా కదిలింది. ఇప్పటికే టాస్క్ఫోర్స్ పోలీసుల సాయంతో శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, ఒకటో పట్టణ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరితో నగదు లావాదేవీలు, ఫోన్ సంభాషణలు, సంక్షిప్త సందేశాలు చేసిన మరో ముగ్గురితో పాటు ప్రధాన బుకీగా ఉన్న విశాఖపట్నానికి చెందిన డి.శ్రీనివాసరావు (శ్రీను) ఆచూకీ పోలీసులకు చిక్కింది. బెట్టింగ్ ద్వారా జరిగిన నగదు లావాదేవీలన్నీ శ్రీను భార్య ద్వారానే జరిగిందని కనిపెట్టడమే కాకుండా ఆదివారం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు విచారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి శ్రీను ఒడిశాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.