
ప్రజారోగ్యానికి శాపాలు
పాపాలు..
● ఒడిశా మార్కెట్లో కాలం చెల్లిన హెరిటేజ్ ఉత్పత్తులు
● ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో వెలుగు చూసిన వాస్తవాలు
● విక్రయిస్తున్న దుకాణాలు సీజ్
● సోషల్ మీడియా పొరాటంతో బయటపడిన బాగోతం
కొరాపుట్: ఆంధ్రా నుంచి ఒడిశాకు వస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ అసలు బండారాన్ని అధికారులు బయటపెట్టారు. కాలం చెల్లిన సరుకులు అమ్ముతున్న వైనాన్ని జనం ముందు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జయపూర్ వస్తున్న హెరిటేజ్ పెరుగు, పాల ప్యాకెట్లే లక్ష్యంగా పుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి వచ్చిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రబాత్ కుమార్ శెఠి నేతృత్వంలో అధికారులు హెరిటేజ్ ఉత్పత్తులు విక్రయిస్తున్న షాపులపై మెరుపు దాడులు చేశారు. ఎంజీ రోడ్డు, మెయిన్ రోడ్డు, సంగీత జంక్షన్ల వద్ద జరిపిన సోదాల్లో కాలం చెల్లిన పాడైన పెరుగు ప్యాకెట్లు పెద్ద ఎత్తున దొరికాయి.
అంతా మా ఇష్టం
వాస్తవానికి పాల ఉత్పత్తుల సంస్థల అవుట్ లెట్లలో విక్రయించే వారికి కొత్త ఉత్పత్తులు ఇచ్చేటప్పుడు కాలం చెల్లిన ఉత్పత్తులు తిరిగి తీసుకొని వెళ్తారు. ఇదే పద్ధతి ఒడిశా ప్రభుత్వ పాల ఉత్పత్తి సంస్థ అమలు చేస్తుంది. ప్రతి రోజూ కొత్త ఉత్పత్తులు ఇవ్వడంతో పాటు కాలం చెల్లిన ఉత్పత్తులను తమ వ్యాన్లోనే తిరిగి తీసుకొని పోతారు. కానీ హెరిటేజ్ ఈ నిబంధన పాటిండం లేదు. ఆంధ్రా నుంచి ఉత్పత్తులు తేవడమే తప్ప పాడైన వాటిని తిరిగి తీసుకువెళ్లడం లేదు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
పక్క జిల్లా అధికారి రాక..
హెరిటేజ్ పై జయపూర్ ప్రజలు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలు రాష్ట్ర రాజధాని వరకు వెళ్లాయి. దాంతో పక్కనే ఉన్న మల్కన్ గిరి జిల్లా నుంచి ఫుడ్సేఫ్టీ అధికారి ప్రబాత్ కుమార్ శెఠిని ఇన్చార్జి హోదాలో పంపించి ప్రభుత్వం దాడులు చేయించింది. కొత్త ముఖాలు కావడంతో దాడుల నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. దాడుల అనంతరం ప్రబాత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. హెరిటేజ్ పై వస్తున్న విమర్శలు నిజమేనని ప్రకటించారు. తానే స్వయంగా కలుషిత హెరిటేజ్ ఉత్పత్తులు పట్టుకున్నానని మీడియాకి చూపించారు. ఇంకా ఎక్కడైనా ఫిర్యాదులు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు.
బాధిత మహిళల ఇంటికి హెరిటేజ్ సిబ్బంది
ఇటీవల జయపూర్ పట్టణంలో హెరిటేజ్ పెరుగు ప్యాకెట్లు కొన్న మహిళలు అందులో కలుషిత పదార్థాలు చూసి సోషల్ మీడియాలో పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో హెరిటేజ్ కంపెనీ ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి అవి కాలం చెల్లినవని వివరణ ఇచ్చారు. మహిళల పోస్టింగ్స్ పెద్ద ఎత్తున వైరల్ కూడా అయ్యాయి.
ప్రజారోగ్యంతో చెలగాటం
హెరిటేజ్ సంస్ధ ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడింది. కాలం చెల్లిన పాలు, పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. పట్టణంలో దాడులు జరుగుతున్నప్పటికీ ఇతర షాపులలో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగించారు. అందుకే అధికారులు హెరిటేజ్ సిబ్బందిని వెంటబెట్టుకొని వెళ్లి దాడులు చేసి తాము పట్టుకున్న కలుషిత హెరిటేజ్ ఉత్పత్తులు వారికి చూపించి వారి సమక్షంలోనే మున్సిపాలిటీ చెత్త డబ్బాల్లో వేశారు. ఈ దాడులు జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు వారి వెంట తరలి వెళ్లారు. పెద్ద మెత్తంలో పాడైన హెరిటేజ్ ఉత్పత్తులు ఉన్న షాపులను సీజ్ చేశారు. పలు షాపుల యజమానులకు ఫైన్లు విధించారు.

ప్రజారోగ్యానికి శాపాలు