
ప్రభుత్వ ఐటీఐ స్థలం కబ్జాకు యత్నం
కాశీబుగ్గ: పలాసలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్థలాన్ని కబ్జా చేసి పునాదులు వేసేందుకు పలాసకు చెందిన ఇద్దరు వ్యక్తులు సోమవారం ప్రయత్నించారు. స్థలాన్ని జేసీబీ ట్రాక్టర్ పెట్టి చదును చేయగా సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ పైల జవహర్ సంఘటన స్థలానికి చేరుకొని అడ్డుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రిన్సిపల్ పై తిరగబడగా.. వారు ప్రిన్సిపాల్ జవహర్తో అసభ్యకరంగా మాట్లాడటంతో కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూదికొండకు వెళ్లే రహదారిలో ప్రైవేటు ఐటీఐ కళాశాలను మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం 25 సెప్టెంబరు 2010లో ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. దానికి ముందు అప్పటి తహసీల్దార్ సహకారంతో సర్వే చేయించి నాటి నివేదికలు ఆధారంగా సర్వే నంబర్ 232 /2ఎ3లో మూడు ఎకరాల 27 సెంట్లు భూమి, కోట్లాది రూపాయలు విలువ చేసే భవనాలను ఉచితంగా ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అప్పగించారు. అయితే ఐటీఐకి సెలవు దినాలలో, సిబ్బంది లేని సమయం చూసుకుని భూబకాసురులు స్థలాలను ఆక్రమించుకునేందుకు పునాదులు తవ్విస్తున్నారు. గతంలోనూ దీనిపై కలెక్టర్ గ్రీవెన్స్కు ఫిర్యాదులు వెళ్లాయి. సర్వే చేయించినా ఆ తర్వాతి కార్యకలాపాలు జరగలేదు. సెలవు దినాల్లో కూడా రోజుకొకరు చొప్పున కాపలా కాయాల్సిన వస్తోందని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐటిఐ ప్రిన్సిపాల్ పైల జవహర్ కోరారు.

ప్రభుత్వ ఐటీఐ స్థలం కబ్జాకు యత్నం