
ఉద్దానం ప్రాజెక్టు ద్వారా ఇచ్ఛాపురానికి తాగునీరు
ఇచ్ఛాపురం: వైఎస్ జగన్ సర్కారు నిర్మించిన వైఎస్సార్ సుజలధార ఉద్దానం ప్రాజెక్టు ఇప్పుడు ఇచ్ఛాపురం మున్సిపాలిటీ దాహం తీర్చనుంది. మున్సిపాలిటీలో తాగునీటి కొరత ఏర్పడడంతో ఉద్దానం ప్రాజెక్టే పెద్దదిక్కుగా మారింది. మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చడానికి సంతపేట వద్ద ఉద్దానం వాటర్ ప్రాజెక్టుని మున్సిపల్ నీటి సరఫరా పంప్హౌస్కి అనుసంధానం చేశారు. ఈ నీటి సరఫరాను సోమవారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ప్రారంభించారు. నదిలో ఇసుక తవ్వకాల వల్లనే మున్సిపాలిటీకి తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన వైఎస్సార్ సుజ లధార ఉద్దానం వాటర్ ప్రాజెక్టు ద్వారా కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస, ఇచ్ఛాపురం మండలాలకు నీటి సరఫరా చేస్తున్నారు. దీనిపై అధికార పక్ష నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఆఖరకు అదే ప్రాజెక్టు ఇప్పుడు దాహం తీరుస్తోంది. అయితే మున్సిపాలిటీ పంప్హౌస్కు అనుసంధానం చేసిన ఘనత తమదే అని ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం కనిపించింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, ఈఈ సుగుణాకర్రావు, మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్, జనసేన ఇన్చార్జి దాసరి రాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.