
దర్గాలో చందనోత్సవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చౌక్బజారు దర్గాలో హజరత్ సయ్యద్ రోషన్ షావళిబాబా రహమతుల్లా షరీఫ్ చందనోత్సవం ఘనంగా నిర్వహించారు. బాబా సమాధికి గంధం పూసి పూలదండలతో అలంకరించి చాదర్ కప్పి ఖురాన్ పఠించారు. షేక్సలీం సోదరుల ఆధ్వర్యంలో లంగర్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జామియా మసీదు ప్రతినిధులు షాన్, రఫీ, బాషా, అహమ్మద్, నజీరుద్దీన్, వహబ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారి అనుమానాస్పద మృతి
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మూడు రోడ్ల కూడలిలో ఉన్న ఓ దుకాణం అరుగుపై విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్థానిక వ్యాపారి వూన నాగరాజుగా గుర్తించి కుటుంబానికి తెలియజేశారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలం జరజాం సమీపంలో బైపాస్ రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతిచెందాడు. బైక్ నడుపుతున్న అడపా సింహాచలం (39) ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే మృతి చెందిన విషయం తెలిసిందే. వెనుక కూర్చున్న బాలి సింహాచలం (64) తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అత్యవసర చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుక్కల దాడిలో
ఆవుదూడ మృతి
పొందూరు: మండలంలోని తండ్యాం గ్రామంలో కుక్కల దాడిలో ఆదివారం ఉదయం లంకలపల్లి వెంకటరావుకు చెందిన ఆవుదూడ మృతి చెందింది. రైతు తన కల్లంలోని ఏడాది వయస్సు కలిగిన ఆవుదూడను కట్టి ఇంటికి వెళ్లే సరికి కుక్కలు గుంపు ఒక్కసారిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామపెద్ద భాస్కరరావు పొందూరు పశుసంవర్ధకశాఖ ఏడీకి సమాచారం ఇవ్వడంతో వైద్యులు వచ్చి చికిత్స చేసినా అప్పటికే దూడ మృతిచెందింది. కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
‘కూర్మ’లో వేసవి శిక్షణ శిబిరాలు
హిరమండలం: ఆధ్యాత్మిక గ్రామం కూర్మలో యువతకు వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయని వర్ణాశ్రమ నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 వరకూ శిబిరాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. భారత సనాతన సంస్కృతిని నెలకొల్పడం, స్వయం సమృద్ధి సాధించడం, పూర్వపు వృత్తులను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో చేనేత, గానుగ ఆడింపు, మట్టికుండల తయారీ, వడ్రంగి, కర్రసాము, వైదిక గృహనిర్మాణం, ప్రకృతి వ్యవసాయం, మంత్రధ్యానం, శ్రవణం, కీర్తనం, వైదిక జీవనం ప్రాముఖ్యత, రసాయనాలు లేని ఆహారం, శాస్త్ర అధ్యయనం, ఆధ్యాత్మిక సాధన తదితర అంశాల్లో యువతకు శిక్షణ ఇస్తామని వివరించారు. 15 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించాలని, సెల్ఫోన్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యుత్తో పాటు ఇతరత్రా ఆధునిక సదుపాయాలేవీ ఉండవని, సరళం, సహజం, సంప్రదాయకం, ధార్మిక జీవనం కోసమే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలకు 7732075607, 8712011776 నంబర్లను సంప్రదించాలని కోరారు.

దర్గాలో చందనోత్సవం

దర్గాలో చందనోత్సవం

దర్గాలో చందనోత్సవం