
సాగునీటి కోసం చలో కలెక్టరేట్
కాశీబుగ్గ: పలాస మండలం రేగులపాడు వద్ద చేపట్టిన ఆఫ్షోర్ రిజర్వాయర్ను త్వరతగతిన పూర్తి చేసి శివారు భూములకు సాగునీరు, పలాస కాశీబుగ్గ జంట పట్టణాలకు తాగునీరు అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరరావు డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి శివారు భూములకు సాగునీరు అందించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7న కలెక్టర్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. శనివారం కాశీబుగ్గ బస్టాండ్ వద్ద జీపుజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములను త్యాగం చేసిన రైతుల నిర్వాసితుల కాలనీల్లో నేటికీ మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు. గొట్టాబ్యారేజ్ ఆధునీకరణకు రూ.1600 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వంశధార నదిని బాహుదా నదితో అనుసంధానం చేసి ఇచ్ఛాపురం వరకు సాగునీరు అందించాలని కోరారు. మందస మండలం గోపాలసాగరాన్ని మినీ రిజర్వాయర్ చేసి మహేంద్రగిరి నుంచి వచ్చిన నీటిని గోపాలసాగరానికి మళ్లించాలన్నారు. నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ చేసి కుడి, ఎడమ కాలువల ద్వారా శివారు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. మహాధర్నాలో రైతులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదరులు వి.రమణ, వి.పసాద్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.భాస్కరరావు, వాసు, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.