రణస్థలం: మండలంలోని బంటుపల్లి రాధాగోవింద మందిరం సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఎస్పీ రమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి ద్విచక్రవాహనంతో వచ్చిన రమణ బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన రమణను 108 అంబులెన్సులో శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. కొవ్వాడ గ్రామానికి చెందిన రమణ పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈదురుగాలుల బీభత్సం
పాతపట్నం: మండలంలోని కొదూరు పంచాయతీ ప్రహరాజపాలెం సమీపంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా భారీ గాలులు వీయడంతో రైతులు రావాడ వెంకటరావు, ప్రసాద్ మహంతి, జాడ సవరయ్య, చిప్పాడ నారాయణ, మంత్రి సోమేష్, మంత్రి లచ్చయ్య, రావాడ రవికిరణ్, కుంటుమహంతి వేణుగోపాల్కు చెందిన ఐదు ఎకరాల స్వీట్కార్న్ పంట నేలకొరిగింది. మరో పది రోజుల్లో పంట చేతికి వచ్చేదని, ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు.