బెట్టింగ్‌లకు పాల్పడవద్దు | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌లకు పాల్పడవద్దు

Mar 25 2025 2:02 AM | Updated on Mar 25 2025 1:56 AM

గుర్తుంచుకోండి

● తెలియని లింక్‌లపై క్లిక్‌ చేస్తే చిక్కులు

● డేటా కాజేసి దోచేస్తారు

● అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ నిపుణులు

శ్రీకాకుళం క్రైమ్‌:

జిల్లా కేంద్ర సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో ఒక వివాహిత నివాసముంటోంది. ఆమెకు ఫ్యాషన్స్‌పై మోజు ఉండడంతో ఎఫ్‌బీలో తక్కువ ధరకే సిల్క్‌ శారీస్‌ అంటూ ఆఫర్‌తో కూడిన ఒక లింక్‌ వస్తే క్లిక్‌ చేసింది. దీనికోసం ఆమె రూ.1,200 లు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేసింది. అయితే కొద్దిరోజులకే వచ్చిన పార్సిల్‌లో కనీసం రూ.200 లు విలువైనా చేయని చీర రావడంతో లబోదిబోమంది.

నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు జాబ్‌ చేస్తున్నాడు. విజిల్‌ అప్‌డేట్స్‌ పేరుతో లోన్‌ అప్రూవ్డ్‌ అంటూ ఒక మెసేజ్‌ అతడి సెల్‌ఫోన్‌కు వచ్చింది. డియర్‌.. యువర్‌ 25,000 లోన్‌ హేజ్‌ బీన్‌ అప్రూవ్డ్‌ సక్సెస్‌ఫుల్లీ, చెక్‌ యువర్‌ డీటైల్స్‌ హియర్‌ అంటూ ఓ లింక్‌ వచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఆ లింక్‌పై క్లిక్‌ చేసిన వెంటనే అతని అకౌంట్‌, ఆధార్‌, యూపీఐ డీటైల్స్‌ అన్నీ సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. అకౌంట్‌లో ఉన్న రూ.60 వేలు మాయమయ్యాయి.

ఇలా మెసేజులు, ఈ–మెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, టెలిగ్రామ్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో తక్కువ అక్షరాలతోనే షార్ట్‌ వెబ్‌ లింక్‌లు పంపించి సైబర్‌ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. జిల్లాలో ఇటువంటి మోసాలు కోకొల్లలు. చిన్నవిగా వచ్చే ఈ లింక్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డేటా చోరీ

వాస్తవానికి పెద్దవిగా, గజిబిజి అక్షరాలతో ఉండే వెబ్‌లింక్‌లను చిన్నవిగా షార్ట్‌ లింక్‌ల మాదిరిగా చేసి ఎవరికై నా పంపే ఆప్షన్లు ఇప్పుడొచ్చేసాయి. దీంతో దీనినే ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు ఏమార్చుతున్నారు. షార్ట్‌లింక్స్‌లో మాల్వేర్‌లను పంపి వైరస్‌లను వ్యాప్తి చేస్తున్నారు. దీనిద్వారా మన ఫోన్‌ లేదంటే కంప్యూటర్‌లో ఉన్న పర్సనల్‌ డేటా హ్యాక్‌ చేస్తారు. ఈ–మెయిల్‌ ద్వారా వచ్చే లింక్‌ క్లిక్‌ చేస్తే ఫేక్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయ్యి తెలియక మన వివరాలన్నీ ఎంటర్‌ చేసేస్తాం. హ్యాకర్లు ఈ లింక్‌లతో మన సిస్టమ్‌ను వారి కంట్రోల్‌లోకి తీసు కుని క్రిప్టో మైనింగ్‌ ద్వారా డబ్బులు దోచేస్తారు.

హలో అంటూ అందినకాడికి..

వేసవి సమీపిస్తుండడంతో మన ఇంట్లో ఉపయోగించే ఏసీ, ఫ్రిజ్‌, టీవీల వంటివి రిపేర్‌ అవుతుంటాయి. అలాంటి సమయంలో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం నెట్‌లో వెదికితే అవే కంపెనీల పేరిట ఫేక్‌ కాల్‌ సెంటర్ల నుంచి సైబర్‌ ఫ్రాడ్స్‌ ఎరవేస్తారు. టెలీ కాలర్స్‌లా మాట్లాడి బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌ డీటైల్స్‌, ఓటీపీ, యూపీఐ పిన్‌ అడుగుతారు. ఎన్నో ప్రముఖ కంపెనీల పేరిట పుట్ట గొడుగుల్లా ఫేక్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్లు నడుస్తుండడం, ఇంటర్నెట్‌లో దర్శనమిస్తుండడంతో మోసపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే యువత కాల్‌ సెంటర్లలో డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశించి, టెలీ కాలర్స్‌గా చేరితే తీరా అవి మోసపూరితమైనవని తెలిశాక అవాక్కవుతున్నారు.

సైబర్‌ అలెర్ట్‌

సెల్‌ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, వాట్సాప్‌, ఈ–మెయిల్‌కు వచ్చే లింకుల్లో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాలి.

తెలియని లింక్‌లు క్లిక్‌ చేయకూడదు. ఒక వేళ తెలియక క్లిక్‌ చేసినా డబ్బులు పంపించకూడదు.

ఓటీపీ, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ పిన్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే సైట్స్‌లో ఎంటర్‌ చేయరాదు.

తెలియని క్యూఆర్‌ కోడ్‌లు స్కాన్‌ చేయరాదు.

క్రెడిట్‌ కార్డులో నగదు పెంచేందుకు గడువు ఒక్కరోజే ఉంది. ఓటీపీ చెబితే వెంటనే అప్‌డేట్‌ చేస్తామంటారు. ఇలాంటివి నమ్మవద్దు.

మీరు ఆన్‌లైన్‌లో కొన్న వస్తువుకు గిఫ్ట్‌ వచ్చింది. అడ్రస్‌ చెబితే ఇంటికి పంపిస్తామని ఫేక్‌ కాల్‌ సెంటర్‌ నుంచి ఫోన్‌ వస్తుంది. చిరునామా గానీ, బ్యాంకు ఖాతా వివరాలు కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వరాదు.

ఎవరైనా పైన పేర్కొన్న సైబర్‌ మోసాలకు గురైతే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయాలి. లేదంటే https://www.cybercrime. gov.inలో ఫిర్యాదు చేయాలి. మీ పరిధిలో ఉండే పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలి. సంబంధిత బ్యాంకువారిని మోసపోయిన గంటలోనే సంప్రదించాలి.

శ్రీకాకుళం క్రైమ్‌: ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో యువత బెట్టింగ్‌లకు పాల్పడి, జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నిర్వాహకులపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, మ్యాచ్‌లను వినోద ప్రక్రియలో చూడాలి తప్ప కుటుంబంలో విషాదం నింపేదిగా ఉండరాదన్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల జోలికి పోకూడదని సూచించారు. బెట్టింగ్‌లో ఒకసారి ఆదాయమొచ్చినట్లు అనిపించినా, పలుమార్లు నష్టపోవడం జరుగుతుందన్నారు. నష్టాలను భర్తీ చేసేందుకు, అప్పులు తీర్చేందుకు నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారని, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంపులుగా కూర్చొని సెల్‌ చూస్తూ బెట్టింగ్‌లకు పాల్పడినా, బెట్టింగ్‌లను నిర్వహించినా ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెట్టింగ్‌లకు పాల్పడినట్లు సమాచారముంటే డయల్‌ 112/100కు లేదా సంబంధిత పరిధి పోలీసులకు తెలపాలని కోరారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

ఎస్పీ కేవీ

మహేశ్వరరెడ్డి

బెట్టింగ్‌లకు పాల్పడవద్దు 
1
1/2

బెట్టింగ్‌లకు పాల్పడవద్దు

బెట్టింగ్‌లకు పాల్పడవద్దు 
2
2/2

బెట్టింగ్‌లకు పాల్పడవద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement