మెళియాపుట్టి: మండలంలోని పెద్దమడి బాలికల సంక్షేమ వసతి గృహంలో సోమవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న శ్వేత అనే విద్యార్థిని అస్వస్థతకు గురై కింద పడిపోయి స్పృహ కోల్పోయింది. నందిగాం మండలం సవరలింగుపురం గ్రామానికి చెందిన శ్వేత మెళియాపుట్టి మండలం పెద్దమడి బాలికల సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి చదువుతుంది. సోమవారం గణితం పరీక్ష రాస్తూ.. కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సపర్యలు చేశారు. పరీక్షలకు ముందు అనారోగ్యం బారిన పడడంతో తల్లిదండ్రులు పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందజేసినట్లు విద్యార్థి తెలిపింది. నీరసంగా ఉండడంతోనే కళ్లు తిరిగాయని వైద్య సిబ్బంది తెలిపారు. సపర్యల అనంతరం ఆమె మళ్లీ పరీక్ష రాసింది.