దంతలో
మట్టి తరలిస్తున్న టిప్పర్
సోమవారం రాత్రి
చీకటిలో
మట్టి తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళి మండలంలోని దంత గ్రామంలో గల పెద్ద చెరువు నుంచి అక్రమంగా రాత్రి పూట మట్టి తరలిస్తున్నారు. కీలక నేత పేరు చెప్పుకుని మట్టి రవాణా చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, తరలింపు జరుగుతుండగా ఇప్పుడా అక్రమాల్లో మట్టి కూడా చేరింది. టెక్కలి నియోజక వర్గంలో ఇప్పటికే మైనింగ్ దందా నడుస్తోంది. అనుమతి లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రానైట్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా చేస్తున్నారు. పర్మిట్లతో పని లేకుండా బ్లాకులు తరలిపోతున్నాయి. ముఖ్యంగా కోటబొమ్మాళి మండలంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. ఇప్పుడు అదే మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రిపూట పెద్ద పెద్ద చెరువులను తవ్వేసి అక్రమంగా తరలిస్తున్నారు. అందులో భాగంగా దంత గ్రామంలోనీ పెద్ద చెరువును కూడా తవ్వేసి వందల లారీల్లో తరలించేస్తున్నారు. సోమవారం రాత్రి 10గంటల సమయంలో అధిక సంఖ్యలో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా పట్టుకునే నాథుడు లేకుండా పోయారు. టిప్పర్ల ద్వారా పెద్ద చెరువు నుంచి రాత్రి పూట మట్టి తరలిస్తున్నారని స్థానికులు అటు పోలీసులకు, ఇటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మాఫియా దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
చీకటిలో వెళ్తున్న టిప్పర్
మట్టి మాఫియా