నేత్రదానం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

నేత్రదానం స్ఫూర్తిదాయకం

Mar 21 2025 12:52 AM | Updated on Mar 21 2025 12:50 AM

శ్రీకాకుళం కల్చరల్‌: నగరంలోని విశాఖ– ఏ కాలనీలో నివాసముంటున్న పొట్నూ రు ధర్మరాజు(71) మృతి చెందడంతో ఆయన కుమారుడు పి.వెంకటరమణ, కుమార్తె ఎ.ప్రవీణ, అల్లుడు రమణమూర్తి నేత్రదానానికి ముందుకొచ్చారు. రెడ్‌క్రాస్‌ ప్రతినిధి తవుడు ద్వారా విషయాన్ని రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి. జగన్మోహనరావుకు తెలియజేయగా నేత్ర సేకరణ కేంద్రం టెక్నికల్‌ ఇన్‌చార్జి సుజాత, పి.సునీతలు హాజరై ధర్మరాజు కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు, కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్‌ దుర్గాశ్రీనివాస్‌ అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరును సంప్రదించాలని కోరారు.

నేడు డీఎంఈ రాక

శ్రీకాకుళం: డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ రఘునందన్‌ శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు రిమ్స్‌ ఆస్పత్రి, వైద్య కళాశాలలను పరిశీలించి వైద్యులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం జిల్లాలోని మరికొన్ని ఏరియా ఆస్పత్రులను పరిశీలించే అవకాశం ఉంది.

పేకాట శిబిరంపై దాడి

కవిటి: మండలంలోని మాణిక్యపురం సమీప కొబ్బరితోట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడిచేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్టు కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.8600 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

టీజీఐ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

గార: మండలంలోని సతివాడ జంక్షన్‌లో ట్రాన్స్‌వర్డ్‌ గార్నెట్‌ ఆఫ్‌ ఇండియా(టీజీఐ) ఇసుక పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్‌ బ్లాక్‌ పక్క ఉన్న స్టాకు గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగడంతో సాయంత్రం వరకు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అగ్నిమాపక శాఖాధికారి వరప్రసాద్‌ తెలిపారు. ఇసుక లోడింగ్‌ చేసే బ్యాగులు కాలిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు.

అదనపు వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయండి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: గ్యాస్‌ సరఫరా సమయంలో సిబ్బంది అధిక మొత్తం వసూళ్లు చేస్తే పౌర సర ఫరా అధికారులకు ఫిర్యాదు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్‌ ఏజె న్సీ నుంచి వినియోగదారులు ఇంటికి 15 కిలోమీటర్ల పైన దూరం ఉంటే రవాణా చార్జి నిమిత్తం ఒక్కో సిలిండర్‌కు రూ.30 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. 15 కిలోమీటర్ల లోపు ఉంటే ఎటువంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్‌ నేడు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్‌ స్వాభిమాన్‌ వినతుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు సహాయ సంచాలకులు కె.కవిత తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

యోగా అవార్డులకు

దరఖాస్తులు ఆహ్వానం

శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర ప్రభుత్వం (ఆయుష్‌ శాఖ), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ(విజయవాడ) ఆదేశాల మేరకు 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి యోగా అవార్డు–2025కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సెట్‌శ్రీ సీఈఓ బి.వి.ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వ్యక్తులు, సంస్థల నుంచి ఆన్‌లైన్‌లో నామినేషన్లు ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వ్యక్తిగత విభాగంలో దరఖాస్తుదారుకు కనీస వయసు 40 ఏళ్లు ఉండాలని, 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నాలు గు అవార్డులను జూన్‌ 21న ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఈ నెల 31తో దరఖాస్తు నమోదు గడువు ముగుస్తుందని తెలిపారు.

నేత్రదానం స్ఫూర్తిదాయకం   1
1/1

నేత్రదానం స్ఫూర్తిదాయకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement