తుఫాన్లా వచ్చాడు..
● 21 కేజీల గంజాయితో తుఫాన్ అనే వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం:
ఒడిశా రాష్ట్రం డెంకానాల్ జిల్లా నువా గ్రామానికి చెందిన తపన్ సమాల్ అలియాన్ తుఫాన్ అనే యువకుడు గంజాయితో పట్టుబడినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం సీఐ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తుఫాన్కు గుంటూరులో ఓ డాబా వద్ద తమిళనాడుకి చెందిన ముతురాజ్, సుందర్రుధిర సమితో ‘గంజాయి’ పరిచయం ఏర్పడింది. రూ.15 వేలకు కేజీ గంజాయి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో తన స్వగ్రామం సమీపంలోని గలపాడు నుంచి కేజీ రూ.7500 చొప్పున 21.040 కేజీల గంజాయిని కొనుగోలు చేశాడు. ఒడిశా నుంచి బస్సులో బయలుదేరి ఇచ్ఛాపురం మంగళవారం చేరుకున్నాడు. అనంతరం రైలు కోసం వెళ్తుండగా రత్తకన్న ఎల్సీ రైల్వే గేట్ వద్ద రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో ఓ యువకుడు..
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని 80 ఫీట్ రోడ్డు సమీప ఏపీహెచ్బీ కాలనీ గ్రౌండ్లో రెండు కిలోల గంజాయితో ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తోటపాలెంకు చెందిన లొట్టి సురేష్ ఏపీహెచ్బీ కాలనీ గ్రౌండ్లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ హరికృష్ణ సిబ్బందితో పాటు వెళ్లి సురేష్ను అదుపులో తీసుకోగా అతని వద్ద రెండు కిలోల గంజాయి ప్యాకెట్ లభించింది. సీఐ పైడపునాయుడు ఈ ఘటనపై ఆరా తీశారు. అనంతరం సురేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్ఐ హరికృష్ణ తెలిపారు.