● మొదలైన పది పరీక్షలు
ఒక కేంద్రం బదులు..
మరో కేంద్రానికి
మెళియాపుట్టి: చీపురుపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగ విద్యార్థి ఎన్.ఈశ్వరరావు జాడుపల్లి జెడ్పీహెచ్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. వాస్తవానికి ఈశ్వరావు చాపర జెడ్పీ స్కూల్లో పరీక్ష రాయాల్సి ఉంది. ఆ విషయం అతని తండ్రికి తెలియక సదరు విద్యార్థిని తీసుకొని మెళియాపుట్టి పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. అయితే దివ్యాంగ విద్యార్థి తరపున పరీక్ష రాయాల్సిన యువకుడు (స్క్రైబ్) చాపర సెంటర్ వద్ద నిరీక్షిస్తున్నాడు. సమయం కూడా మించిపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది హాల్ టికెట్ చూసి మళ్లీ చాపర పంపించారు. ఉపాధ్యాయులు అవగాహన కల్పించకపోవడంతోనే ఇబ్బంది పడ్డామని తండ్రి వాపోయారు. అనంతరం విద్యార్థి పరీక్ష రాశాడు.
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు విద్యార్థులు పరీక్ష రాశారు. తొలిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్కు రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లావ్యాప్తంగా 28,357 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 28,140 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 217 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొలిరోజు ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
● విద్యార్థుల అవస్థలు
పదో తరగతి పరీక్ష కేంద్రాల సమీపంలో పోలీసులు 144 సెక్షన్ను పక్కాగా అమలు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలోకి ఎవరినీ అనుమతించలేదు. విద్యార్థులను సైతం కేంద్రాల్లోకి ప్రవేశించేటప్పుడు నిశితంగా పరిశీలించారు. కొన్ని కేంద్రాల్లో పోలీసులు అతిగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించలేదు. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేయడం, ట్రాఫిక్ కష్టాలు, నిర్దేశిత కేంద్రాలకు బస్సులు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. ఎంపిక చేసిన రూట్లలో బస్సులు తిరగలేదని వాపోయారు. అలాగే కరెంట్ కోతలతో అటు అధికారులు, ఇటు విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో సైతం ఉక్కపోతల నడుమ విద్యార్థులు పరీక్షలు రాశారు.
● అధికారుల తనిఖీలు విస్తృతం
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ని సందర్శించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు. ఫర్నీచర్ ఏర్పాట్లు, తాగునీరు, ఇతర వసతులను పరిశీలించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళంలోని గీతాంజలి స్కూల్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి అధికారులను ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. పోలీసు బందోబస్తుపై పోలీసులకు పలు సూచనలు చేసి, 144 సెక్షన్ పటిష్టంగా అమలు కావాలని దిశానిర్దేశం చేశారు. టెన్త్ పరీక్షల జిల్లా పరిశీలకుడు, ఏపీఈర్ఈఐఎస్ డైరెక్టర్ వీఎన్ మస్తానయ్య రాగోలు, ఆమదాలవలస, శ్రీకాకుళంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈవో డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, ఎగ్జామినేషన్స్ అసిస్టెంట్ కమిషనర్ లియాకత్ ఆలీఖాన్లు సంయుక్తంగా అంపోలు, గార, కళింగపట్నం కేంద్రాలను తనిఖీ చేశారు. సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ సంపతిరావు శశిభూషణ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, డీవైఈవోలు, ఇతర అధికారులు పరీక్ష కేంద్రాలను చుట్టుముట్టారు. కాగా సీ–సెంటర్లగా ఉన్న 65 కేంద్రాలపై అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. తొలిరోజు విద్యార్థులతో సహా హాజరైన తల్లిదండ్రులు, బంధువులతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం
జిల్లావ్యాప్తంగా 149 కేంద్రాల్లో పరీక్షలు
తొలిరోజు 217 మంది గైర్హాజరు
పరీక్ష కేంద్రాల వద్ద పక్కాగా 144 సెక్షన్ అమలు
‘ఓపెన్ స్కూల్’ పరీక్షలు ఆరంభం
అలాగే జిల్లాలో సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా చేపట్టే టెన్త్ పరీక్షలు సైతం సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12.30 గంటల నుంచి వరకు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 8 కేంద్రాల్లో జరిగిన ఓపెన్ టెన్త్ పరీక్షలు తొలిరోజు 59 మంది రాయాల్సి ఉండగా, 9 మంది గైర్హాజరయ్యారు. ఇద్దరు ఫ్లయింగ్, 8 మంది సిట్టింగ్ స్క్వాడ్స్లు పరీక్ష కేంద్రాలపై నిఘా పెట్టారు.
ఉరుకులు.. పరుగులు
ఉరుకులు.. పరుగులు