
డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్ష ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో డిసెంబర్లో జరిగిన స్పెషల్ డ్రైవ్ డిగ్రీ–1, 2, 3 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జ్ఞానభూమి వెబ్సైట్, వర్సిటీ వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంచామని యూజీ ఎగ్జామినేషన్స్ ఇన్చార్జి డీన్ పి.పద్మారావు తెలిపారు. రీ వాల్యుయేషన్కు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
● బీసీ సంక్షేమశాఖలో ఇద్దరు చిరుద్యోగుల నుంచి లంచం డిమాండ్
● రూ.25 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : చిరుద్యోగుల నుంచి లంచం తీసుకుంటూ బీసీ సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి, సీఐ కె.భాస్కరరావులు విలేకరులకు వివరాలు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కుక్, అటెండర్లకు ఇంక్రిమెంట్లు, ఇతర ఎరియర్స్ బిల్లులు పెట్టేందుకు సీనియర్ అసిస్టెంట్ బాలరాజు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. వారు ఇచ్చి న సూచనల మేరకు బుధవారం మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో బాధితుల నుంచి రూ.10,000, రూ.15,000 చొప్పున మొత్తం రూ.25,000బాలరాజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
గాడితప్పిన ‘సంక్షేమం’
కాగా, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు ఏసీబీ దాడుల్లో పట్టుపడటం ఇది మూడోసారి. డీబీసీగా రవిచంద్ర ఉన్న సమయంలో ఉపకార వేతనాల కుంభకోణంలో అప్పటి అధికారులు, సిబ్బంది ఏసీబీకి చిక్కారు. ఆరుగురు సస్పెండయ్యారు. ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. మూడేళ్ల క్రితం బీబీసీగా శ్రీదేవి ఉన్న సమయంలో విద్యార్థుల యూనిఫారాల కుట్టు మజూరీలు చెల్లించేందుకు లంచం అడిగిన జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా బాలరాజు సైతం ఏసీబీకి చిక్కారు. అయితే ఈ ఘటనలన్నింటిలోనూ చిన్నస్థాయి ఉద్యోగులకే కాకుండా ఉన్నతాధికారుల భాగస్వామ్యం కూడా ఉండే అవకాశం ఉందంటూ పలువురు చర్చించుకోవడం గమనార్హం. నెల రోజులు క్రితం ఈ శాఖ అధికారులు, వార్డెన్లను ఏసీబీ అధికారులు కార్యాలయానికి పిలిపించారు. అవినీతి కార్యక్రమాలపై ఆరాతీశారు. వీటిలో ప్రధానంగా బీఆర్ (బొడ్డేపల్లి రాజగోపాలరావు) శతజయంతి ఉత్సవాలకు రూ.25 లక్షలు ఖర్చు చేసినట్టు చూపించారని, అందులో భారీగా అవినీతి జరిగిందని, బదిలీలు, పదోన్నతులు, తదితర అంశాలపై ఆరాలు తీసినట్లు తెలిసింది. అయినా ఈ శాఖలోని కొందరు అవినీతి ఉద్యోగుల్లో మార్పు రాలేదు.
పక్కాగా ‘పది’ పరీక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, డీఈవో తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు.