● నిధులు కేటాయించకపోతే పోరాటం తప్పదు ● సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు
నందిగాం: ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కె.మోహనరావులు డిమాండ్ చేశారు. ప్రజా చైతన్య యాత్రల్లో భాగంగా బుధవారం నందిగాంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు 2007లో ప్రారంభించారని, నేటికి 18 ఏళ్లు గడుస్తున్నా సగం పనులు కూడా పూర్తవ్వకపోవడం దారుణమన్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాపై పాలకులకు ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రారంభంలో రూ.127 కోట్లు అంచనా వ్యయం కాగా, ప్రస్తుతం అది రూ.852 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రిజర్వాయర్కు తగిన నిధులు ఎందుకు కేటాయించలేదో మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపులు పాత పనుల బిల్లులకే సరిపోతాయని ఎద్దేవా చేశారు. రిజర్వాయర్ పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రూ.500 కోట్లు కేటాయించాలన్నారు. ఆఫ్షోర్ పూర్తయితే 24,600 ఎకరాలకు సాగునీటితో పాటు పలాసకు తాగునీరు అందుతుందని తెలిపారు. పెండింగ్ పనులకు నిధులు కేటాయించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. అలాగే జిల్లాలో గిరిజన ప్రాంతాన్ని ఐదో షెడ్యూల్లో చేర్చాలని, ఐటీడీఏను ఏర్పాటు చేయాలని, రైతులు పండించిన పంట మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు పాలిన సాంబమూర్తి, హనుమంతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.