
మీ కిడ్నీలు భద్రమేనా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో డయాలసిస్ కిడ్నీ రోగుల దుస్థితి దయనీయంగా మారింది. ఉద్దానంలో ఈ ఒక్కరిదే కాదు వందలాది మంది డయాలసిస్ రోగుల పరిస్థితి ఇలాగే ఉంది. కవిటి, సోంపేట సీహెచ్సీ పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో డయాలసిస్ చేయడం అసాధ్యంగా మారింది. అప్పటికే డయాలసిస్ చేసుకుంటున్న వారు చనిపోతే తప్ప కొత్త వారికి డయాలసిస్ చేసే పరిస్థితి జిల్లాలో లేదు. జిల్లాలో 25వేలకు పైగా కిడ్నీ రోగులు ఉన్నారు. కిడ్నీ రోగులతో పాటు డయాలసిస్ కు చేరుకుంటున్న వారి కూడా సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడున్న డయాలసిస్ యూనిట్లు సరిపోవడం లేదు. మరోవైపు మృత్యువాత పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. 2024–25లో సుమారు 100మంది కిడ్నీ రోగులు మరణించినట్టుగా తెలుస్తోంది. డయాలసిస్ సెంటర్లతో పాటు అన్ని పీహెచ్సీల్లో గత ప్రభుత్వం 12 రకాల మందులను ఉచితంగా సరఫరా చేసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నెప్రాలజిస్టుౖలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్లి తనిఖీలు చేసుకోవల్సిన పరిస్థితి. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు అవుతుండటం, ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఫించన్లు ఇవ్వకపోవడంతో కుటుంబాలు చిదికిపోతున్నాయి. ఒక్క ఉద్దానం ఏరియాలోనే జిల్లాలో కూడా కిడ్నీ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం ఆ స్థాయిలో అప్రమత్తం కావడం లేదు.
కవిటి మండలం సహలాలపుట్టుగ గ్రామానికి చెందిన పొట్టి దుర్యోధన ఐదు నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. గతంలో టీబీ క్యాన్సర్తో పోరాటం చేసి కోలుకుంటున్న దశలో కిడ్నీ మహమ్మారి సోకడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇతనికి భార్య జమున, ఐదు, ఏడు తరగతులు చదువుతున్న కుమార్తెలు మోక్ష, సమీరా ఉన్నారు. సొంతిల్లు లేకపోవడంతో స్పెసెల్ గాయ్స్ ఫౌండేషన్ సభ్యులు నిర్మించిన చిన్నపాటి గుడిసెలో తలదాచుకుంటున్నారు. తొలుత శ్రీకాకుళంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. వేలాది రూపాయలు ఖర్చు చేశారు. సోంపేట, కవిటి డయాలసిస్ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా డయాలసిస్ చేయించాలని వేడుకోగా.. ఎవరైనా చనిపోతే ఆ స్థానంలో డయాలసిస్ అవకాశం ఉందంటూ సిబ్బంది చెప్పేశారు. శుక్రవారం మరోమారు కవిటి వెళ్లి సిబ్బంది కాళ్లావేళ్లా పడితే చేతికి ‘ఫిస్టల్’ అమర్చారని, త్వరలో పిలుస్తామంటూ చెప్పి నేటికి వారం దినాలు అవుతున్నా కబురు పంపలేదని భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం స్పందించి ఉచితంగా డయాలసిస్ చేయించి తండ్రి ప్రాణాలు కాపాడాలని కుమార్తెలు వేడుకుంటున్నారు.
స్వీయ అప్రమత్తత తప్పనిసరి
కిడ్నీ పనితీరుపైనే మన ఆరోగ్యం
కిడ్నీలు ఒంట్లోని వ్యర్థాలు, అదనపు నీటిని బయటకు పంపిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కావల్సిన హార్మోన్ కిడ్నీ నుంచే వస్తుంది. విటమిన్– డీ చివరి రూపం కూడా కిడ్నీలోనే ఏర్పడుతుంది. తద్వారా ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శరీరంలో నీటిస్థాయిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. గుండె తర్వాత బ్లడ్ ప్రజర్ని కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే...
ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మేలు. జంక్ ఫుడ్, కొవ్వులు ఎక్కువగా ఉండే నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. శరీరం బరువు పెరగకుండా కంట్రోల్లో ఉంచుకోవాలి. రోజుకి సరిపడా నీళ్లు తాగాలి. కూరగాయలు, ఆకు కూరలు తినాలి. డయాబెటిస్, బీపీ సమస్యలతో బాధపడుతున్న వారు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్ వంటి మందులు రెగ్యులర్గా వాడకూడదు. అనారో గ్యంగా ఉన్నట్లు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఆ మూడు పరీక్షలు చాలు
క్రియాటినిన్, అల్ట్రా సౌండ్, యూరిన్ టెస్ట్ అనేవి కిడ్నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి చేసే సాధారణ పరీక్షలు. కిడ్నీ ఆరోగ్యంగా ఉందా? లేదా? అనేది తెలుసుకోవడానికి క్రియాటెనిన్ చేస్తారు. కిడ్నీలు పరిణామం తెలుసుకోవడానికి ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. కిడ్నీ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి మూత్ర పరీక్షలు చేస్తారు. కొందరికీ మూడు పరీక్షలు అవసరం అవుతాయి. కొందరికి వీటిలో ఏదొక పరీక్షలో సమస్య బయటపడుతుంది.
ఆ మూడు పరీక్షలు తప్పనిసరి
జిల్లాను పట్టిపీడిస్తున్న కిడ్నీ మహమ్మారి
బాధితులకు భరోసా ఇవ్వని కూటమి ప్రభుత్వం
నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం

మీ కిడ్నీలు భద్రమేనా?