శ్రీకాకుళం క్రైమ్ : మహిళా దినోత్సవం నాడు ఆ మాతృమూర్తి రోధన వర్ణనాతీతం. కన్నకొడుకు చెక్కతో కొట్టి రోడ్డుపైకి అమాంతం నెట్టేసి 13 రోజులవుతున్నా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నేరుగా ఎస్పీ మహేశ్వరరెడ్డి వద్ద మొరపెట్టుకునేందుకు కుమార్తెతో సహా జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చింది. ఉదయం 11:30 గంటలకు వచ్చిన ఆమె సాయంత్రం 3:10 గంటల వరకు ఎదురు చూసి వెనుదిరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలైన సౌభాగ్య భర్త అప్పారావు అంగవైకల్యంతో 11 ఏళ్ల క్రితమే మరణించడంతో లావేరు హైస్కూల్ ఎదురుగా పెంకుటిల్లులో నివసిస్తోంది. ఒక కుమారుడు విశాఖలో ఉండగా.. మరో కుమారుడు లావేరు హైస్కూల్ సమీపంలోనే టిఫిన్ కొట్టు నడుపుతున్నాడు. కుమార్తెకు మురపాకకు చెందిన వ్యక్తితో వివాహమైనా ఆమె భర్త కొన్నాళ్లకే చనిపోవడంతో పిల్లలతో కలిసి తల్లి వద్దకే వచ్చేసింది. కాగా, కుమారులు తల్లిని పట్టించుకోకపోవడంతో సౌభాగ్య పాన్షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఇటీవల కాలువ పనుల్లో భాగంగా పాన్షాపు తీసేశారు. దీంతో భర్త పేరిట ఉన్న స్థలంలో దుకాణం పెట్టుకునేందుకు ఇటీవల సౌభాగ్య ప్రయత్నించగా చిన్న కుమారుడు లక్ష్మణరావు అడ్డుకున్నాడు. చెక్కతో గాయపరచడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా రక్తపు గాయాలు కాలేదని, కేసు కట్టేది లేదని చెప్పారని, అందుకే ఎస్పీకి మొరపెట్టేందుకు వచ్చినట్లు వృద్ధురాలు వాపోయింది. సిబ్బంది సోమవారం రావాలని చెప్పడంతో వెనుదిరిగింది.