పొందూరు: మండల కేంద్రం పొందూరులో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్ల డెలివరీ సమయంలో అదనపు బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై ఐవోఎల్ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. అదనపు వసూళ్లపై మూగోడువీధి మహిళలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. అదనపు వసూళ్లు వాస్తవమేనని కొందరు మహిళలు తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు మూగోడువీధిలో విచారణ జరిపి కలెక్టర్కు నివేదికలు అందించారు.
ఆలయంలో చోరీ
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కొండమ్మతల్లి ఆలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. హుండీని దొంగలు పగలుగొట్టి నగదు పట్టుకుపోయారు. అక్కడి వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. స్థానికులు మంగళవారం ఉదయం పూజలు నిమిత్తం ఆలయానికి చేరుకుని పరిశీలించగా చోరీ జరిగిందని గుర్తించారు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించగా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు.