ధర్మవరం అర్బన్: ఉపాధ్యాయుల సమస్యలపై తలపెట్టిన ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బుక్కచెర్ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో మంగళవారం పీఆర్టీయూ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల డిమాండ్ల సాధనకు తలపెట్టిన దశల వారీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 21న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా పాలకులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీని ఏర్పాటు చేసి 30శాతం ఐఆర్ ప్రకటించాలని, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని, 2003 డీఎస్సీ వారికి మెమో 57ను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలను ఆయా జిల్లాల కలెక్టర్ల పరిధిలో చేపట్టాలన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలోని ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్లు ఏర్పాటు చేయాలని, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలను గ్రేడ్ వన్ హెచ్ఎంలుగా పరిగణించాలని కోరారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గురుకులాలను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. కేజీబీవీ వారికి ఎంటీఎస్ వర్తింప చేయాలని, విద్యాశాఖలో పనిచేస్తున్న సీఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఇన్సర్వీస్ వ్యాయామ ఉపాధ్యాయులకు బీపీఈడీ, ఎంపీఈడీ చేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు మోడల్ ప్రైమరీ స్కూల్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి


