హిందూపురం: కంటికి రెప్పలా కూతుళ్లను కాపాడుకున్న ఆ తండ్రి చివరికి ఎవరూ లేని అనాథలా కాలగతిలో కలసిపోయాడు. అందరూ ఉన్నా కూడా చివరికి అనాథలా అందరి నుంచి అందనంత దూరానికి వెళ్లిపోయాడు. తమ మతం కాదు, కులం కాదు.. అయినా మానవత్వమే తమ మతమంటూ ముందుకు వచ్చిన కొందరు ఆ వృద్ధుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. హిందూపురంలో వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేసింది. వివరాలు.. స్థానిక సేవామందిరం వద్ద ఉన్న ప్రశాంతి మందిరం వృద్ధాశ్రమంలో కొన్నేళ్లుగా జీవనం గడుపుతున్న అనంతపురానికి చెందిన ఆర్టీసీ విశ్రాంత డ్రైవర్ బలిజ పెద్ద సిద్ధన్న ఆదివారం మృతి చెందాడు. ప్రశాంతి మందిరం సేవకులు ఫోన్ ద్వారా ఆయన ఇద్దరు కుమార్తెలకు సమాచారం చేరవేయగా.. ‘మాకు వచ్చేందుకు కుదరదు, మీరే పూడ్చేయండి’ అంటూ వారు కుండబద్దలు కొట్టారు. దీంతో మందిరం నిర్వాహకురాలు సిస్టర్ వల్సల్ హిందూపురంలోని టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆయన మానవతా రక్తదాన సంఘం అధ్యక్షుడు షేక్ షబ్బీర్, ఉబెదుల్లా హుసేన్ సహకారంతో హిందూ సంప్రదాయాల ప్రకారం సిద్ధన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉమర్ ఫారూఖ్ మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. కులమతాలకతీతంగా ఒకరినొకరు గౌరవించుకోవాలని కోరారు.


