పెనుకొండ (సోమందేపల్లి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. సోమందేపల్లి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తే నేడు చంద్రబాబు మాత్రం హామీలను అటకెక్కించి ప్రజలను దారుణంగా మోసగించారన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ ప్రతినెలా రూ.1,500 ఇస్తానన్న చంద్రబాబు ఆ విషయమే పట్టించుకోవడం లేదన్నారు. హామీల ప్రకారం ఇప్పటికి రూ. 97,200 కోట్లు ఆడపడుచులకు బకాయి పడ్డారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే ఫింఛన్ ఇస్తానని చెప్పి కుచ్చుటోపీ పెట్టారన్నారు. ‘తల్లికి వందనం’ కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15 వేలు ఇస్తామని చెప్పి 20 లక్షల మందికి మొండిచేయి చూపారన్నారు. ఉచిత బస్సుతో మహిళలకు చుక్కలు చూపుతున్నారన్నారు. ఇకపై చంద్రబాబు ఎంత చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు నాగమణి, కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు డీసీ అశోక్, టౌన్ కన్వీనర్ గోవిందమ్మ గారి శ్రీనివాసులు, ఉప సర్పంచ్ వేణు, గట్టా మంజునాథ్, ఏ. నరసింహమూర్తి, ట్రాక్టర్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
అక్కచెల్లెమ్మలకు
రూ.కోట్లలో బకాయి పడ్డారు
మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మండిపాటు


