ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తు న్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు.ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● కలెక్టర్ శ్యాంప్రసాద్
పుట్టపర్తి అర్బన్: పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్లోని ఎస్జీ కన్వెన్షన్ కల్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ ముందడుగు వేయడం శుభపరిణామ మన్నారు. ప్రతి మహిళ ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఏఎస్పీ అంకిత సురానా మాట్లాడుతూ మహిళలు, యువతులు ఆత్మరక్షణ విద్యలో ఆరితేరాలన్నారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ శ్యాంప్రసాద్ సందర్శించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో రుణాల మెగా చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. సబ్సిడీపై 10 కుట్టుమిషన్లు, చిలమత్తూరు రైతు సేవా కేంద్రం ద్వారా ఎఫ్పీఓకు రూ.15 లక్షల విలువైన ట్రాక్టర్ను పంపిణీ చేశారు. మహిళా ఉద్యోగులు, వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు మెమొంటోలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీటీ డైరెక్టర్ విశా ఫెర్రర్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


