
ఆ డాక్టర్పై చర్యలు తీసుకోండి
పుట్టపర్తి టౌన్: తన భార్య మృతికి కారణమైన కదిరి ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ రుచితారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కదిరికి చెందిన బాధితుడు మనోహర్ కోరారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. డాక్టర్ రుచితారెడ్డి తన దైనందిన విధుల అనంతరం స్థానికంగానే నిర్వహిస్తున్న రేణుకా వైద్యశాలలో రోగులకు చికిత్స చేస్తుంటారన్నారు. ఈ క్రమంలో కదిరిలోని గాంధీనగర్లో నివాసముంటున్న మనోహర్... అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చికిత్స నిమిత్తం రేణుకా వైద్యశాలకు తీసుకెళ్లారు. రూ.5 వేల ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. పది రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. అక్కడ కూడా సరైన చికిత్స అందజేయకపోవడంతో తిరుపతిలోని సిమ్స్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి మే 2న ఆమె మృతి చెందింది. డాక్టర్ రుచితారెడ్డి నిర్లక్ష్యం, సరైన వైద్యం అందించకపోవడంతోనే ఆమె మృతి చెందినట్లుగా అక్కడి వైద్యులు నిర్ధారణ చేశారని బాధితుడు తెలిపాడు. తన భార్య మృతికి కారణమైన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని కదిరి పీఎస్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని, ఈ విషయంగా తనకు న్యాయం చేయాలంటూ డీఎస్పీ విజయకుమార్ వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన డీఎస్సీ కదిరి పోలీసులతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. కాగా, ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 80 వినతులు అందగా.. ఎస్పీ రత్న స్వయంగా స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, మహిళా డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు.
పోలీసు స్పందనలో బాధితుడు
మనోహర్ ఫిర్యాదు
వివిధ సమస్యలపై 80 వినతులు