
జంట హత్యల కేసులో ఆరుగురి అరెస్టు
రాప్తాడు: రైతు దంపతుల హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాప్తాడు పీఎస్లో సోమవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు వెల్లడించారు. ఈ నెల 17న రాప్తాడు మండలం గొల్లపల్లికి చెందిన రైతు చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతులపై టీడీపీ కార్యకర్తలు వేటకొడవళ్లు, కట్టెలతో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే.
భూ వివాదమే కారణం..
గంగలకుంట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 78–3లో 6.20 ఎకరాల భూమిని ఎకరాకు రూ.56.50 లక్షల చొప్పున కొనుగోలు చేసేలా రాప్తాడుకు చెందిన నీరుగంటి పుల్లమ్మ, అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరుకు చెందిన నాగలక్ష్మమ్మ, బత్తలపల్లి మండలం పోట్లమర్రికి చెందిన వెంకటలక్ష్మికి రూ.79 లక్షలు చెల్లించి రాప్తాడుకు చెందిన పామల్ల ధనుంజయ, పామల్ల కొండప్ప, పామల్ల ఇంద్రశేఖర్, గోనిపట్ల శీన, పామల్ల పండయ్య, గొల్లపల్లి జగదీష్, లక్ష్మీనారాయణ, నంద కుమార్, బుల్లే నగేష్ 2024 సెప్టెంబర్లో అగ్రిమెంట్ చేసుకున్నారు. హతుడు చిగిచెర్ల నారాయణ రెడ్డి తండ్రి చిగిచెర్ల నారాయణరెడ్డి నుంచి 1997లో ఎకరా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.93 వేలతో కొనుగోలు అగ్రిమెంట్ను పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మమ్మ రాయించుకున్నారు. అయితే చిగిచెర్ల నారాయణరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించకుండా ఉండడంతో ముగ్గురు మహిళలు కోర్టులో దావా వేశారు. 2012లో కోర్టులో ముగ్గురు మహిళల పక్షాన డిక్రీ చేస్తూ వాళ్ల పేరుపై కోర్టు రిజిస్ట్రేషన్ చేయిం చింది. అనంతరం ఇదే భూమిని చిగిచెర్ల నారాయణ రెడ్డి తన బావ ఓబిరెడ్డి ద్వారా అతని భార్య నారాయణమ్మకు చెందుతుందని కోర్టులో దావా వేయించాడు. ఈ వివాదంపై 2022లో ముగ్గురు మహిళలకు భూమి చెందుతుందని కోర్టు తీర్పు వెలువరించగా.. దీన్ని సవాల్ చేస్తూ నారాయణ రెడ్డి అదే ఏడాది ఫ్యామిలీ కోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. ప్రస్తుతం ఆ భూమిలో నారాయణరెడ్డి దానిమ్మ చెట్లు సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో భూమిని తమ పేరుపై మ్యుటేషన్ చేయాలని ముగ్గురు మహిళలు ఈ ఏడాది హైకోర్టులో పిల్ వేయగా.. సరైన నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్డీఓకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వివాదం కొలిక్కి రాకనే....
వివాదం కొలిక్కి రాకనే ముగ్గురు మహిళల నుంచి భూమిని కొనుగోలు చేసిన వారు నెల రోజుల క్రితం మళ్లీ సదరు మహిళలకు రూ.1.01 కోట్లు చెల్లించారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీఓ సిఫారసుల మేరకు సదరు భూమిని ఆన్లైన్లో నారాయణరెడ్డి పేరు తొలగించి ముగ్గురు మహిళల పేరు ఎక్కించాలని గత నెల 29న డీఆర్ఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ నారాయణరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అయితే డీఆర్ఓ ఆదేశాల మేరకు గత నెల 14న నీరుగంటి పుల్లమ్మ పేరును రాప్తాడు తహసీల్దార్ ఆన్లైన్లో ఎక్కించారు. 16న పామల్ల ధనుంజయ, పామల్ల కొండప్ప, గోనిపట్ల శీన, పామల్ల పండయ్య, హనుమంతరెడ్డి, బాల నరసింహరెడ్డి, నిరంజన్రెడ్డి, పుల్లమ్మ, నాగలక్ష్మమ్మ, దండు నరేంద్ర, గొల్లపల్లి జగదీష్, గంగలకుంట లక్ష్మీనారాయణ, బుల్లె నగేష్ సదరు పొలం దగ్గరికి వెళ్లి నారాయణరెడ్డి, ఆయన భార్య ముత్యాలమ్మను భూమిలోకి కాలు పెడితే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ నెల 17న ఉదయం 9.30 గంటలకు జేసీబీతో పొలంలో దానిమ్మ చెట్లను తొలగిస్తుండగా నారాయణరెడ్డి, ముత్యాలమ్మ, వారి కుమారుడు ప్రదీప్కుమార్ రెడ్డి, బావమరిది ప్రతాప్రెడ్డి, శంకర్రెడ్డి, వెంగల్రెడ్డి తదితరులు అక్కడకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న వేటకొడవళ్లు, కట్టెలతో ముత్యాలమ్మ, నారాయణరెడ్డిపై విచక్షణారహితంగా దాడికి తెగబడడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రతాప్రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో సోమవారం గంగలకుంట క్రాస్ వద్ద పామల్ల ధనుంజయ, ఇంద్రశేఖర్, నిరంజన్రెడ్డి, దండు నరేంద్ర, బుడగ లక్ష్మీనారాయణ, కందుకూరుకు చెందిన దయ్యం హనుమంతరెడ్డిని అరెస్ట్ చేశారు.
వివరాలు వెల్లడించిన
రూరల్ డీఎస్పీ వెంకటేశులు

జంట హత్యల కేసులో ఆరుగురి అరెస్టు