
వైఎస్సార్సీపీ నేతపై దాడి
కదిరి టౌన్: స్థానిక 31 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అమ్మజాన్ కుమారుడు, వైఎస్సార్సీపీ నేత షేక్ ఖాదర్వలిపై టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు అహమ్మద్ అలీ, అతని అన్న కుమారులు ముగ్గురు దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... అహమ్మద్ అలీ, అతని అన్న కుమారులు గురువారం వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేస్తుండగా వార్డు కౌన్సిలర్ లేకుండా ఎలా పంపిణీ చేస్తున్నారంటూ ఖాదర్వలి ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. పింఛన్ల విషయంలో తలదూరిస్తే అంతు చూస్తానని బెదిరించారు. క్షతగాత్రుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం చేసిన ఫిర్యాదు మేరకు సీఐ వి.నారాయణరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: స్థానిక ఇందిరమ్మ కాలనీ నివాసి ఆంజనేయులు (36) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఆంజనేయులు, నారాయణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత కాలంగా నారాయణమ్మ భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉండిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఆంజనేయులు గురువారం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని నిర్జన ప్రదేశంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు.

వైఎస్సార్సీపీ నేతపై దాడి