
పారిశ్రామిక అభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి
ప్రశాంతి నిలయం: పారిశ్రామిక అభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని, అందువల్ల జిల్లాలో పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ చేతన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. తొలుత జిల్లా పరిశ్రమల శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరిశ్రమల స్థాపన కోసం అందే దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ఇప్పటికే అందిన దరఖాస్తుల్లో ఏవైనా పెండింగ్లో ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే పీఎం విశ్వకర్మ పథకం గురించి పట్టణ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకు గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహానీ, డీపీఓ సమత, ఎల్డీఎం రమణకుమార్, పరిశ్రమల శాఖ అధికారి కృష్ణమూర్తి, జిల్లా ఫైర్ ఆఫీసర్ హేమంత్రెడ్డి, డిక్కీ ప్రతినిధి వెంకటరమణ పాల్గొన్నారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం
కలెక్టర్ టీఎస్ చేతన్
బసవేశ్వరుడి జీవితం ఆదర్శప్రాయం
మూఢనమ్మకాలను రూపుమాపుతూ సమాజోద్ధరణకు కృషిచేసిన మహానుభావుడు బసవేశ్వరుడు అని కలెక్టర్ టీఎస్ చేతన్ కొనియాడారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వరుడి 894వ జయంత్యుత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి చిత్రపటానికి కలెక్టర్ చేతన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. లింగాయత్ సంప్రదాయాన్ని రూపొందించడంలో బసవేశ్వరుడు కీలక పాత్ర పోషించారన్నారు. హైందవ మతాన్ని సంస్కరించడంలోనూ కీలక పాత్ర పోషించారన్నారు. భక్తి కన్నా మంచి ప్రవర్తనే ముఖ్యమని ప్రవచించారని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఏఓ వెంకటనారాయణ, టూరిజం అధికారి ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామిక అభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి