
మెడికో ఆశలను చిదిమేసిన రోడ్డు ప్రమాదం
ధర్మవరం: సెంట్రింగ్ పనులు చేసే అతను..తన పిల్లలు తనలా కూలి పనులు చేయకూడదని భావించాడు. రెక్కలకష్టంతోనే కుమారుడు, ఇద్దరు కూతుళ్ల భవితకు బాటలు వేస్తున్నాడు. నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో కుమారుడిని ఎంబీబీఎస్ చదివిస్తున్నాడు. తెల్లకోటు వేసుకుని మెడలో స్టెత్తో కనిపించాల్సిన కుమారుడిని తెల్లబట్టలో చుట్టి కళ్లముందు పెట్టడంతో ఆ తండ్రి బోరున విలపించాడు.
కుమారుడిని డాక్టర్గా చూడాలని..
ధర్మవరం లోనికోటకు చెందిన నవదీయ కేశవనాయక్ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి కుమారుడు నరేష్నాయక్(23), ఇద్దరు కూతుళ్లు గాయత్రి, నందిని సంతానం. కుమారుడు నరేష్నాయక్ను ఉన్నత స్థానంలో ఉంచాలని భావించాడు. ఈక్రమంలోనే నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేర్పించాడు. కుమార్తె గాయత్రి బీటెక్, మరో కుమార్తె నందిని ఇంటర్ చదువుతోంది. ప్రస్తుతం నరేష్ నాయక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన కుమారుడు వైద్య పట్టా అందుకుంటే తమ కుటుంబం కష్టాలన్నీ తొలగిపోవడంతో పాటు సమాజానికి తనవంతుగా ఓ మంచి వైద్యుడిని అందించినవాడిని అవుతానని కేశవనాయక్ అనుకునేవాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులతో తరచూ చెప్పుకునేవాడు. కానీ అతని ఆశలపై విధి నీళ్లు పోసింది. బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాళెం సమీపంలో జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ప్రమాదంలో నరేష్నాయక్ మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలియగానే కేశవనాయక్ కాళ్ల కింద భూమి కంపించింది. వైద్యుడిగా తెల్లకోటుతో వస్తాడనుకున్న కుమారుడిని తెల్లబట్టలో చుట్టిపెట్టిన చిత్రాలను చూసి శోకసంద్రంలో మునిగిపోయాడు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు నెల్లూరుకు వెళ్లాడు. దీంతో లోనికోటలో విషాద ఛాయలు అలముకున్నాయి.
నెల్లూరు జిల్లాలో ప్రమాదం..
ధర్మవరం విద్యార్థి మృతి
సెంట్రింగ్ పనులు చేస్తూ కుమారుడిని ఎంబీబీఎస్ చదివిస్తున్న తండ్రి
కుమారుడి మృతివార్త విని
తల్లడిల్లిన కుటుంబం

మెడికో ఆశలను చిదిమేసిన రోడ్డు ప్రమాదం