
బాలికను కాపాడిన పోలీసులు
హిందూపురం: మైనర్ బాలికను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల చెంతకు పోలీసులు చేర్చారు. వివరాలు...హిందూపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల వయసున్న బాలికను పరిగి మండలం బీచగానిపల్లికి చెందిన ఓ యువకుడు సోమవారం తనతో పాటు పిలుచుకెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు తెలిపారు. స్పందించిన డీఎస్పీ మహేష్ ఆదేశాలతో రూరల్ సీఐ ఆంజనేయులు, ఎస్ఐ మునిప్రసాద్, సిబ్బంది బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సోమందేపల్లి మండలం వెలగమాకులపల్లి తండా గుట్టల్లో ఉన్నట్లుగా గుర్తించి, ఎస్ఐ మునిప్రతాప్, ఎఎస్ఐ జయరామిరెడ్డి, సోమందేపల్లి ఎస్ఐ రమేష్ అక్కడకు వెళ్లి రాత్రి 7 గంటల సమయంలో యువకుడితో పాటు మైనర్ బాలికను హిందూపురం రూరల్ పీఎస్కు పిలుచుకువచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.
యువకుడి దుర్మరణం
పావగడ: రోడ్డు పక్కన నిలబడిన లారీని వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహన చోదకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పావగడ తాలూకా క్యాతగానచెర్లు గ్రామానికి చెందిన కురుబ సుబ్బిరెడ్డి, లక్షీదేవి దంపతుల నాల్గవ కుమారుడు ప్రదీప్(23) తుమకూరులోని ఓ ద్విచక్రవాహనాల షోరూంలో మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని చేదోడుగా నిలిచాడు. ఆదివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై శిరా గేట్ ప్రాంతానికి బయలుదేరిన ఆయన.. జోరుగా వర్షం కురుస్తుండడంతో రోడ్డు సరిగా కనపడక ఎదురుగా నిలబడిన లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బీటెక్ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలను ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి సోమవారం విడుదల చేశారు. పరీక్షలు జరిగిన 15 రోజుల్లోనే ఫలితాల విడుదలకు కృషి చేసిన డిప్యూటీ కంట్రోలర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కే. మాధవి, డాక్టర్ డి .లలిత కుమారి కృషి ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ అనంతపురం పాలకమండలి సభ్యుడు ఎం.రామశేఖర్రెడ్డి, విభాగాధిపతులు టి.నారాయణరెడ్డి, జి.మమత, కళ్యాణ్కుమార్, అజిత, జరీనా పాల్గొన్నారు.

బాలికను కాపాడిన పోలీసులు