
పునర్వ్యవస్థీకరణలో అసంబద్ధాలు తొలగించండి
కదిరి అర్బన్: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణలో అసంబద్ధాలను తొలగించాలని కూటమి ప్రభుత్వాన్ని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కదిరికి విచ్చేసిన డీఈఓ కృష్ణప్పకు ఫ్యాప్టో చైర్మన్ హరిప్రసాద్, కో చైర్మన్ షామిల్లా వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. నిబంధనలకు అనుగుణంగా పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల తీర్మానాలతో పాఠశాల పునర్ నిర్మాణ ప్రక్రియ చేపట్టాలన్నారు. చాలా ప్రాంతాల్లో పాఠశాల కమిటీ తీర్మానాలను పరిగణనలోకి తీసుకోకుండా పునర్నిర్మాణ ప్రక్రియ చేపడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉర్దూ సెక్షన్ ఉన్న తెలుగు మీడియం పాఠశాలల్లో ఉర్దూ పోస్టులను రద్దు చేయడం జరిగిందన్నారు. ఉన్నఫలంగా ఉర్దూ సెక్షన్, ఉర్దూ పోస్టులను రద్దు చేయడంతో ఉర్దూ మాధ్యమం చదివే పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో అతావుల్లా, ఆష్రఫ్, వాజిద్, సొహెల్, గౌస్ అహమ్మద్, తదితరులు ఉన్నారు.