నెల్లూరు(టౌన్): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ తొలిరోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో జరగ్గా 1,422 మందికి గానూ 1,345 మంది విద్యార్థులు హాజరయ్యారు. 77 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగింది. విద్యార్థులను పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా కేంద్రాల్లోకి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించారు. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ వాచ్లు తదితర వాటిని అనుమతించలేదు. తల్లిదండ్రులు కేంద్రాల వద్ద రావడంతో సందడిగా మారింది. కాగా బయట తాగునీటిని ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో చెట్లు, దుకణాల సముదాయాల వద్ద సేదతీరారు.


