● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా వీఆర్వో గ్రేడ్ – 2 నుంచి గ్రేడ్ – 1కు పదోన్నతులు పొందిన 110 మంది సచివాలయాల వీఆర్వోలకు మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా, పారదర్శకంగా సేవ చేయాలని హితవు పలికారు. చిన్న తప్పు చేసినా వెంటనే ప్రజల్లో దోషులుగా నిలబడే పరిస్థితి ఉందన్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగి సమాజం తక్కువగా చూసే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. వీఆర్వోలు ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటారని, వారికి ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ, సహకారాలు అందించడం బాధ్యతగా భావించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసులు, తహసీల్దార్ డానియల్ పీటర్ తదితరులు పాల్గొన్నారు.


