● తనిఖీలు ముమ్మరం
నెల్లూరు(క్రైమ్): జిల్లా రైల్వే పోలీస్ యంత్రాగం అప్రమత్తమైంది. గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వేస్టేషన్ సమీప ఆలూరుగేటు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘటన నేపథ్యంలో నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ నేతృత్వంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో (38 మంది) కూడిన ప్రత్యేక బృందాలు రైల్వేస్టేషన్లు, నేరాలు అధికంగా జరిగే అవకాశమున్న తెట్టు, వెంకటేశ్వరపురం, అల్లూరురోడ్డు, తలమంచి, కొడవలూరు, మనుబోలు, గూడూరు ఔటర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. పాతనేరస్తుల కదలికలపై నిఘా పెంచడంతోపాటు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు.
ప్రధాన రైల్వేస్టేషన్లో..
నెల్లూరు ప్రధాన స్టేషన్లో సీఐ తన సిబ్బందితో కలిసి రైళ్లలో జరుగుతున్న నేరాలు, నియంత్రణ చర్యలు, ప్రయాణికుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రయాణ సమయంలో తమ సామగ్రి, విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. కొందరు సహచర ప్రయాణికుల ముసుగులో నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై హరిచందన, సిబ్బంది పాల్గొన్నారు.


