● నౌకకు జెండా ఊపిన కలెక్టర్, పోర్టు సీఈఓ
ముత్తుకూరు (పొదలకూరు): నెల్లూరు జిల్లా రైతులు పండించిన మొక్కజొన్నకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల్లో భాగంగా కృష్ణపట్నం పోర్టు నుంచి వియత్నాంకు మొక్కజొన్న ఎగుమతి నౌకను మంగళవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా, సీఈఓ జగదీష్ పటేల్తో కలిసి నౌకను జెండా ఊపి ప్రారంభించారు. ఎంవీ పర్వరాజ్ పేరుతో బయలుదేరిన నౌక ద్వారా 53,318 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను వియత్నాంకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో మొక్కజొన్న పంట అధికంగా దిగుబడి కావడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మొక్కజొన్న ఎగుమతులకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపట్టింది. మొక్కజొన్న ఎగుమతుల ద్వారా రైతులకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభించడంతోపాటు, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరుగుతుందని అధికారులు తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో పోర్టు, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.


