● ఐదుగురికి గాయాలు
● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
మర్రిపాడు: మండలంలోని సింగనపల్లి సమీపంలో 565 జాతీయ రహదారిపై కార్మికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమబెంగాల్కు చెందిన 46 మంది కార్మికులు శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు ఇటీవల అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వస్తుండగా, సింగనపల్లి సమీపంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడగా, వారిని స్థానికులు, పోలీసులు కలిసి వెంటనే బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎంవీఐ రాములు, మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని 46 మందిని ప్రైవేట్ వాహనంలో తరలించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


