● కిందపడి మున్సిపల్
కార్మికుడి మృతి
ఆత్మకూరు: పారిశుద్ధ్య కార్మికుడు ట్రాక్టర్ పైనుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆత్మకూరులో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, మున్సిపల్ కార్మికుల వివరాల మేరకు.. అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చిచ్చు మల్లికార్జున (32) ఆత్మకూరులో వివాహం చేసుకుని ఇక్కడే నివాసముంటున్నాడు. ఆప్కాస్ ద్వారా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడిగా నియమింపబడి పనిచేస్తున్నాడు. గురువారం చెత్త సేకరించిన ట్రాక్టర్ బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డు వద్ద అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్పై నుంచి జారిపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమై కోమాలోకి చేరుకున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్, మరో కార్మికుడు పరిశీలించి వెంటనే మల్లికార్జునను ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఎక్స్గ్రేషియా చెల్లించాలి
మృతుని కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషి యా చెల్లించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ఆప్కాస్ ద్వారా ఉద్యోగం కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కమిషనర్ సి.గంగాప్రసాద్ అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఆర్థిక సాయం త్వరలోనే అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.


