రాపూరు: చైన్నె నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు, నెల్లూరు, తిరుపతి జిల్లాల రైతులు, ప్రజల అవసరాల నిమిత్తం నీటిని కండలేరు జలాశయం నుంచి బుధవారం విడుదల చేశారు. తొలుత గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుగంగ ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న పవర్ప్లాంట్ యూనిట్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కండలేరు జలాశయంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. చైన్నె నగర ప్రజలకు, పరిశ్రమలకు, తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రజలకు, రైతులకు తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం 130 రోజుల్లో 13.78 టీఎంసీలను నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తిరుపతి జిల్లాలో 70 వేల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 54 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. చైన్నె నగరానికి తాగునీటి కోసం 5 టీఎంసీలు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాలకు తాగునీటి కోసం 2, స్వర్ణముఖి బ్యారేజ్కి 2, మేనకూరు పారిశ్రామికవాడకు ఒక టీఎంసీని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ అనిల్బాబు, ఏఈ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


