 
															బాధితులకు ఆందోళన అక్కర్లేదు
నెల్లూరు రూరల్: తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు పునరావాసం, సహాయక చర్యలను విస్తృ త స్థాయిలో చేపట్టామని, బాధితులకు ఆందోళన అక్కర్లేదని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని కోరారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి 25 కిలోల బియ్యంతో పాటు ప్రతి కుటుంబానికి అదనంగా బంగాళదుంపలు, కందిపప్పు, ఉల్లిపాయలు, చక్కెరను కిలో చొప్పున, లీటర్ పామాయిల్ను అందజేయనున్నామని వెల్లడించారు. మత్స్యకారులు, చేనేత కుటుంబాలకు 50 కిలోల బియ్యాన్నివ్వాలని చెప్పారు. జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఖజానా శాఖ
అధికారిగా శ్రీనివాసులు
నెల్లూరు రూరల్: ఖజానా శాఖ జిల్లా డీడీ (ఎఫ్ఏసీ)గా బాధ్యతలను శ్రీనివాసులు మంగళవారం స్వీకరించారు. గతంలో ఈ స్థానంలో పనిచేసిన గంగాద్రి మరణించడంతో ఉప ఖజానాధికారిగా పనిచేస్తున్న ఈయన్ను నియమించారు. ఖజానా సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. కాగా శ్రీనివాసులును పలువురు అభినందించారు.
ఆర్టీఏ అధికారుల దాడులు
వింజమూరు(ఉదయగిరి): కర్నూలులో బస్సులో ఇటీవల అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో వింజమూరులో ప్రైవేట్ బస్సులను రవాణా శాఖ అధికారులు గురువారం తనిఖీ చేశారు. అగ్ని నిరోధక పరికరాల్లేకపోవడంతో ఓ బస్సును సీజ్ చేశారు. అన్ని ప్రైవేట్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని చెప్పారు. జిల్లా ఉప రవాణాధికారి మురళీధర్, ఎమ్వీఐలు సుందర్రావు, కరుణాకర్, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.
ఎట్టకేలకు స్పందించిన
రవాణా అధికారులు
అనుమసముద్రంపేట: ఏఎస్పేట మండల కేంద్రంలోని ప్రైవేట్ వాహనాలను రవాణా శాఖ అధికారులు ఎట్టకేలకు గురువారం తనిఖీ చేశారు. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద నేపథ్యంలో ‘స్టాండ్లోనే ట్రావెల్స్ బస్సులు’ అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమవడంతో రవాణా అధికారులు స్పందించారు. ఈ క్రమంలో ఆగి ఉన్న బస్సులను తనిఖీ చేసి వాటి పత్రాలను ఎమ్వీఐ రాములు తనిఖీ చేశారు. బస్సులు ఫిట్గా ఉన్నాయా.. పన్నులు చెల్లిస్తున్నారాననే అంశాన్ని ఆరాతీశారు. బస్సులు పూర్తిస్థాయిలో ఫిట్గా ఉంటేనే రోడ్లపైకెళ్లాలని చెప్పారు. లేని పక్షంలో సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
 
							బాధితులకు ఆందోళన అక్కర్లేదు
 
							బాధితులకు ఆందోళన అక్కర్లేదు
 
							బాధితులకు ఆందోళన అక్కర్లేదు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
