
పిల్లాపేరును చెరిపేస్తున్నారు
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చ నేతలు చెలరేగిపోతున్నారు. సహజ వనరులను కొల్లగొడుతూ జేబులు నింపుకొంటున్నారు. పిల్లాపేరులోని ఇసుకను రేయింబవళ్లూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ ఊడ్చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలను ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేపట్టి రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో పడి కళ్ల ముందే జరుగుతున్న ఇసుక అక్రమ తరలింపును పట్టించుకోవడం లేదు. దీంతో పిల్లాపేరు పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీగా సాగు
కొండాపురం, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి, సీతారామపురం మండలాల పరిధిలో పిల్లాపేరు సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. వర్షాకాలంలో నీటి ప్రవాహంతో ఇసుక మేట పడుతుంది. దీంతో భూగర్భ జలాలు పెరిగి సమీప ప్రాంతాల్లోని రైతులు వివిధ పంటలను సాగు చేస్తారు. అయితే ఏడాది కాలంగా పచ్చ నేతలు ఇక్కడ నిత్యం యంత్రాలను ఉపయోగించి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.
ట్రాక్టర్ల ద్వారా కొల్లగొడుతూ..
ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, పామూరు ప్రాంతాలకు పిల్లాపేరు నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. దూరం బట్టి ఒక్కో ట్రాక్టర్కు రూ.1500 నుంచి రూ.3500 వరకు బాడుగ వసూలు చేస్తున్నారు. మరోవైపు పేదలు తమ ఇళ్ల నిర్మాణం కోసం ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, ఆటోలను ఉపయోగించి కూలీల ద్వారా ఇసుకను లోడ్ చేయించి అవసరాలను తీర్చుకోవచ్చనే జీఓను ప్రభుత్వం జారీ చేసింది. అయితే అధికార పార్టీ నేతలు తమ ట్రాక్టర్లను ఉపయోగించి ఇసుకను రవాణా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఇలా..
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇసుక అవసరమైతే సచివాలయం వద్ద తమ వివరాలను నమోదు చేసుకొని పర్మిట్ పొంది రవాణా చేసుకునే అవకాశం ఉండేది. దీంతో అక్రమ రవాణాకు అవకాశం లేదు. అయితే ఇప్పడా విధానాన్ని తొలగించడంతో రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ఇసుక వెళ్తోంది. పేదలు అఽధిక ధరలను చెల్లించాల్సి వస్తోంది. ఇసుక ఉచితమని పేరుకు చెప్తున్నా, ఎక్కడా అది అమలుకు నోచుకోవడంలేదు.
నిబంధనలను ఉల్లంఘించి
యంత్రాలతో ఇసుక తవ్వకాలు
అడుగంటుతున్న భూగర్భ జలాలు
పట్టించుకోని అధికార యంత్రాంగం