
‘ఆక్వా’ ఎగుమతుల ప్రోత్సాహానికి చర్యలు
నెల్లూరు రూరల్: జిల్లాలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేలా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 973 దరఖాస్తులు రాగా, 856ను ఆమోదించామని చెప్పారు. పెండింగ్లో ఉన్న మిగిలిన వాటిని రానున్న సమావేశంలోపు ఆమోదించాలని సూచించారు. వాణిజ్య పన్నులు, కార్మిక, లీగల్ మెట్రాలజీ తదితర శాఖల వద్ద ఉన్న కేసులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా కంపెనీలకు అవసరమైన మానవ వనరులకు అవసరమైన శిక్షణను ఇప్పించేలా.. సీఎస్సార్ నిధులను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణను సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మారుతిప్రసాద్, ఏపీఐఐసీ అధికారి శివకుమార్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ తదితరులు పాల్గొన్నారు.
కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేయాలి
జిల్లాలో మత్స్యకారులు, పాడి రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గానూ కిసాన్ క్రెడిట్ కార్డులను విరివిగా అందజేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లను సమన్వయం చేసుకొని ఐదు వేలకుపైగా కిసాన్ క్రెడిట్ కార్డులను వారంలోపు అందజేయాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేందుకు రుణాలను అందజేయాలని కోరారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమ క్రమబద్ధీకరణ ద్వారా రెడీ టు ఈట్, రెడీ టు కుక్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. అనంతరం వార్షిక రుణ ప్రణాళిక బుక్లెట్ను ఆవిష్కరించారు. ఎల్డీఎం మణిశేఖర్, నాబార్డు డీడీఎం బాబు, పశుసంవర్థక, మత్స్యశాఖ జేడీలు రమేష్నాయక్, నాగేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, మెప్మా పీడీ లీలారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు.