గంజాయి విక్రయిస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయిస్తుండగా..

Jun 22 2025 11:43 AM | Updated on Jun 22 2025 11:43 AM

గంజాయి విక్రయిస్తుండగా..

గంజాయి విక్రయిస్తుండగా..

నెల్లూరు(క్రైమ్‌): ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకొచ్చి నెల్లూరులో విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంతపేట పోలీసుస్టేషన్‌లో శనివారం నగర డీఎస్పీ పి.సింధుప్రియ స్థానిక ఇన్‌స్పెక్టర్‌ జి.దశరథరామారావుతో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రశాంత్‌ కుమార్‌ భోల్‌ కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చాడు. హరనాథపురం ఎక్స్‌టెన్షన్‌ ఏరియాలో నివాసం ఉంటూ ఎంబ్రాయిడరీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అతను తన వ్యసనాలను తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం గంజాయి విక్రయాలకు తెరలేపాడు. ఒడిశా రాష్ట్రంలో కేజీ గంజాయిని రూ.5 వేల చొప్పున కొనుగోలు చేసి వాటిని చిన్ని ప్యాకెట్లుగా చేసి నెల్లూరు నగరంలో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు. కొద్దిరోజులుగా సంతపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో ఇన్‌స్పెక్టర్‌ తన సిబ్బందితో కలిసి గంజాయి విక్రయాలపై దాడులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ప్రశాంత్‌కుమార్‌ భోల్‌ శుక్రవారం ఆత్మకూరు బస్టాండ్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలోని ఓ లాడ్జి ఎదురుగా గంజాయి విక్రయించేందుకు ఉన్నాడని ఇన్‌స్పెక్టర్‌కు పక్కా సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ చెప్పారు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఇన్‌స్పెక్టర్‌, సిబ్బంది శ్రీహరి, లావణ్యకుమార్‌, విజయ్‌మోహన్‌, సుబ్బారావు, సురేంద్రబాబు తదితరులను ఎస్పీ అభినందించారు.

వ్యక్తి అరెస్ట్‌

రెండు కేజీల స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement